ఓటుకు నోటు: చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశాంతంగా నిద్ర పోనిచ్చేలా కనిపించడం లేదు. ఓటుకు నోటు కేసు విచారణను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇందులో ఏపీ సీఎం పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
కోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తూరు జిల్లా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. అంతకముందు తంబళ్లపల్లె నుంచి బెంగళూరు చేరే సమయంలో, అక్కడినుంచి విజయవాడకు చేరుకునే క్రమంలో ఫోన్లో న్యాయ నిపుణులతో, పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
నిజానికి చిత్తూరు జిల్లా పర్యనటలో భాగంగా సోమవారం తిరుపతి పట్టణంలో ప్రజారోగ్యంపై నిర్వహించే సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి చంద్రబాబు కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే దానిని చంద్రబాబు అర్ధాంతరంగా రద్దు చేసుకుని తంబళ్లపల్లెలో కార్యక్రమం ముగిసిన తర్వాత బెంగళూరు వెళ్లి అక్కడినుంచి విజయవాడకు చేరుకున్నారు.
విజయవాడకు చేరుకునే సమయంలో మార్గం మధ్యలో 'ఏసీబీ కోర్టులో పిటిషన్దారు ఏమని అప్పీల్ చేశారు, ఇరుపక్షాల న్యాయవాదులు ఏమి వాదనలు వినిపించారు, కోర్టు ఏమని ఉత్తర్వులు ఇచ్చింది' తదితర అంశాల గురించే చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం.

ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు దాటింది. ఈ కేసులో తొలుత కొంత హడావుడి జరిగినా ఆ తర్వాత కేసు పురోగతి కుంటుపడింది. ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబులిద్దరూ లాలూచీ పడ్డారని ప్రతిపక్షాలు సైతం అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి, దర్యాప్తు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారించిన కోర్టు.. సెప్టెంబర్ 29లోపు దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది.
ఈ కేసులో కోర్టు తాజా ఆదేశాలు సంచలనాన్ని సృష్టించాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయిస్తే మంచిదని కొందరు న్యాయవాదులు చంద్రబాబుకు సలహా ఇచ్చారని సమాచారం.
అయితే చంద్రబాబు మాత్రం కోర్టు ఆదేశాల పూర్తి కాపీ వచ్చిన తర్వాత అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా గతేడాది జూన్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బు ఆశచూపింది.
ఈ కేసులో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కై జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇదే క్రమంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మంతనాలు జరిపిన ఆడియో టేపులు పెను సంచలనాన్ని సృష్టించాయి.
ఆ ఆడియో టేపుల్లో తమ పార్టీ నేతలు ఇచ్చిన హామీలను తాను పూర్తిచేస్తానని, ఎలాంటి ఆలోచన లేకుండా టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని స్టీఫెన్సన్కు చంద్రబాబు ఫోన్లో సూచించారు. ఆ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణ ఇలా సాగింది.
ఫోన్ రింగ్
స్టీఫెన్సన్: హలో..
చంద్రబాబు తరఫు వ్యక్తి: హలో బ్రదర్..
స్టీఫెన్సన్: హా సర్...
చంద్రబాబు తరఫు వ్యక్తి: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టూ యూ. స్టే ఆన్ ద లైన్.. (బాబుగారు మాట్లాడతారు... లైన్లో ఉండండి)
స్టీఫెన్సన్: యా థ్యాంక్యూ
చంద్రబాబు: హలో..
స్టీఫెన్సన్: సర్, గుడ్ ఈవినింగ్ సర్..
చంద్రబాబు: గుడ్ ఈవినింగ్ బ్రదర్... హౌ ఆర్యూ (ఎలా ఉన్నారు?)
స్టీఫెన్సన్: ఫైన్.. థ్యాంక్యూ సర్ (నేను బాగున్నాను సార్.. కృతజ్ఞతలు)
చంద్రబాబు: మనవాళ్లు.. బ్రీఫ్డ్ మీ..(మనవాళ్లు నాకంతా చెప్పారు)
స్టీఫెన్సన్: ఎస్ సార్..
చంద్రబాబు: ఐయామ్ విత్యూ. డోంట్ బాదర్. (నేను మీకు అండగా ఉంటా. ఆందోళన వద్దు.. నిశ్చింతగా ఉండండి)
స్టీఫెన్సన్: రైట్ సర్..
చంద్రబాబు: ఫర్ ఎవ్రీథింగ్ ఐ యామ్ విత్యూ. వాట్ ఆల్ దే స్పోక్.. వీ విల్ హానర్ (అన్నింటికీ మీకు అండగా ఉంటా.
మావాళ్లు ఏమైతే చెప్పారో వాటన్నింటినీ నెరవేరుస్తా)
స్టీఫెన్సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫ్రీ లీ.. యూ కెన్ డిసైడ్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్.. (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉండదు)
స్టీఫెన్సన్: యా.. రైట్ సర్
చంద్రబాబు: ఫర్ యువర్ కమిట్మెంట్... వి వర్క్ టుగెదర్ (మీరు నిబద్ధతతో ఉంటే.. మనమంతా కలిసి పనిచేద్దాం)
స్టీఫెన్సన్: రైట్.. థ్యాంక్యూ సర్
చంద్రబాబు: థ్యాంక్యూ












Click it and Unblock the Notifications