జిహెచ్ఎంసి రాజధాని: హైద్రాబాద్పై 371 హెచ్?
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్టుదలతో ఉన్నారట. హైదరాబాదు పైనే మంత్రుల బృందం(జివోఎం) తర్జన భర్జన పడుతోంది. హైదరాబాదు విషయంలో జివోఎం అధినేత్రికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తెర పైకి కొత్తగా 371 హెచ్ తీసుకు వచ్చారని, తద్వారా అరుణాచల్ ప్రదేశ్ తరహా పాలన హైదరాబాదులో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
సోమవారం సాయంత్రం సోనియాతో జివోఎం సభ్యులు సమావేశమైన విషయం తెలిసిందే. విభజన ప్రక్రియలో పీటముడిలా మారిన హైదరాబాద్పై ఇరుప్రాంతాల వారినీ సంతృప్తి పరిచే ప్రతిపాదనలపై కసరత్తు చేశారు. జివోఎం సభ్యులు అధినేత్రితో సుమారు గంటపాటు చర్చించారు. సమాచారం మేరకు హైదరాబాదు పైన దాదాపు ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తుది నివేదికపై సోనియా వారికి మార్గనిర్దేశం చేశారట.

హైదరాబాద్ విషయంలో 'అరుణాచల్ ప్రదేశ్' ఫార్ములా అనుసరించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అలా అయితే శాంతి భద్రతలు గవర్నర్ ఆధీనంలో ఉంటాయి. హైదరాబాదు పైన కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక గవర్నర్, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ భరద్వాజ సలహా తీసుకున్నారట. జిహెచ్ఎంసి పరిధిని యూటిగా చేయాలని తొలుత ఆయన పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత హైదరాబాద్ విషయంలో అరుణాచల్ తరహా పాల గురించి కూడా సూచించినట్లు సమాచారం. జిహెచ్ఎంసి రాజధానిగా అయ్యే అవకాశముంది.
అరుణాచల్ ప్రదేశ్లో శాంతి భద్రతలను పరిరక్షించే అధికారాలను ఆ రాష్ట్ర గవర్నర్కు దఖలు పరుస్తూ రాజ్యాంగంలో 371(హెచ్) అధికరణను చేర్చారు. ఇదే అధికరణను హైదరాబాద్ విషయంలో కూడా ఉపయోగించవచ్చునని భరద్వాజ సూచించినట్లు తెలుస్తోంది. గవర్నర్కు శాంతి భద్రత విషయంలో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ అంశంపై గవర్నర్ మంత్రి మండలిని సంప్రదించినప్పటికీ అంతిమంగా ఆయన తీసుకున్న నిర్ణయమే అమలవుతుంది.
అయితే, ఈ ప్రత్యేక బాధ్యతలు అవసరం లేదని గవర్నర్ తనంతట తాను రాష్ట్రపతికి నివేదిక పంపినప్పుడు, ఈ అధికారాలను తొలగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు. యూటికి తెలంగాణ నేతలు ససేమీరా అంటున్నందున 371(హెచ్) అధికరణపైనే కేంద్రం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కూడా రాజ్యాంగ సవరణ తప్పదు. కాగా, గతంలో నిజాం రాష్ట్రంలో భాగంగా ఉండి ఆ తర్వాత కర్ణాటకలో కలిసిన హైదరాబాద్ కర్ణాటక అభివృద్దికి చర్యలు తీసుకునేందుకు వీలుగా గవర్నర్కు 371 (జె) ద్వారా అధికారాలు కల్పించారు.
దీనికి సంబంధించిన 118వ రాజ్యాంగ సవరణకు బిజెపి సహకరించింది. అరుణాచల్ ప్రదేశ్లో చైనా నుంచి ముప్పు ఉన్నందుకే 371(హెచ్) ద్వారా గవర్నర్కు శాంతి భద్రతల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే హైదరాబాద్లో ఐఎస్ఐ కార్యకలాపాలు తీవ్రంగా జరుగుతున్నందున,నక్సల్ కార్యకలాపాలు కూడా పెచ్చరిల్లే అవకాశాలున్నందున వ్యూహాత్మక ప్రాధాన్యమున్న సంస్థలు హైదరాబాద్లో ఉన్నందున హైదరాబాద్లో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. అందుకు వీలుగా ఈ బాధ్యతలను గవర్నర్కు అప్పగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications