'విభజనపై' గవర్నర్ ప్లాన్, కేసీఆర్పై బాబు కొలికి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రమంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన హైకోర్టు విభజన, హైదరాబాదులో ఇటీవల నెలకొన్న పరిస్థితులను వివరించారని తెలుస్తోంది.
తొలుత ప్రధాని మోడీతో, ఆ తర్వాత కేంద్రహోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన అంశాలు తదితరాల పైన గవర్నర్ వారితో చర్చించారని తెలుస్తోంది.
గవర్నర్ ప్లాన్
హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఒక 'ఫార్ములాను రూపొందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏడాది చివర్లోనే అమరావతిలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్రం వెంటనే నిధులను విడుదల చేయాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు విభజనకు ఇదే సులువైన మార్గమని ఢిల్లీ పెద్దలకు సూచించారని సమాచారం.
చంద్రబాబు షరతు
హైకోర్టును విభజించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వంతోపాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తేనే హైకోర్టు విభజనకు అంగీకరిస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేస్తోంది. దీనికితోడు, ఏపీ భూభాగంలోనే ఆ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పలుమార్లు హైకోర్టు అంశం కేంద్రం వద్దకు వెళ్లింది.
కేంద్రం ఆలోచన
ఉమ్మడి హైకోర్టును విభజించడంలో చాలా సమస్యలు ఉన్నందువల్ల ఆ అంశాన్ని ఇక పక్కన పెట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టుకు శాశ్వత భవనాలు ఏర్పడేంత వరకూ హైదరాబాదులోనే ఉమ్మడి హైకోర్టు ఉంటుందని కేంద్ర న్యాయ శాఖ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
హైకోర్టు
ఇదిలా ఉండగా, న్యాయాధికారుల నియామకాల సందర్భంగా తలెత్తిన వివాదం సందర్భంగా న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఇటీవల సమీక్ష నిర్వహించినట్లుగా వార్తలొస్తున్నాయి. హైకోర్టు విభజనపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రవిశంకర్ ప్రసాద్ కూడా చేతులెత్తేసినట్లుగా తెలుస్తోందని చెబుతున్నారు. విభజన చట్టంలోని వివిధ క్లాజ్ల కారణంగా ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకూ సుప్రీం కోర్టు కూడా విభజనపై ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తిందని మంత్రి రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారని అంటున్నారు.
హైకోర్టు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరస్పర అంగీకారంతోనే హైకోర్టు విభజన సాధ్యమవుతుందని, విభజన చట్టం ప్రకారమైతే పదేళ్లు ఆగాల్సిందేనని న్యాయ శాఖ వర్గాలు చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల రాయబారిగా ఢిల్లీలో పలువురిని కలిశారని అంటున్నారు.
గవర్నర్ ఫార్ములా
హైకోర్టు విభజనపై గవర్నర్ నరసింహన్ ఓ ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్.. తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
గవర్నర్ ఫార్ములా
సుప్రీం కోర్టు తీర్పు మేరకు షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనకు తెలంగాణ అంగీకరిస్తే, అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు తాము కూడా అంగీకరిస్తామని చంద్రబాబు గవర్నర్కు స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఆయన కేసీఆర్తో కూడా చర్చించారని అంటున్నారు.
ప్రధాని మోడీ
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సీఎం కెసిఆర్.. హైకోర్టు విభజన అంశాన్ని ప్రధానికి వివరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను ప్రధాని మోడీ పిలిపించి ఉంటారని చెబుతున్నారు.