రాజ్యసభకు జివిఎల్: మోడీపై తొలుత చెప్పింది ఆయనే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జివిఎల్ నరసింహారావును రాజ్యసభ సభ్యత్వం దక్కింది. ఆయన బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందినవారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి జివిఎల్ నరసింహారావు రాజ్యసభ బరిలోకి దిగుతున్నారు. ఆయనతో పాటు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు 17 మంది అభ్యర్థుల పేర్లను బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.

మంత్రి పదవికి చాన్స్
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామాలు చేయడంతో జీవిఎల్ నరసింహారావుకు ప్రధాని మోడీ మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎం. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్లిన తర్వాత ఆ స్థానాన్ని జివిఎల్ నరసింహారావుతో భర్తీ చేయాలని బిజెపి నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

జీవిఎల్ నరసింహారావు ఇలా...
జీవిఎల్ నరసింహారావుకు 1998 నుంచి బిజెపితో సంబంధాలున్నాయి. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మీడియా సలహాదారుగా ఆయన పనిచేశారు. నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని తొలుత అంచనా వేసింది చెప్పింది ఆయనే. 2011లో ఆయన ఆ విషయం చెప్పారు.

మంచి వక్త, విశ్లేషకుడు...
జీవిఎల్ నరసింహారావుకు మంచి వక్తగా పేరుంది. రాజకీయ విశ్లేషకుడిగా కూడా ఆయన ప్రఖ్యాతి వహించారు. జాతీయ మీడియాలో ఆయన ఇటీవలి కాలంలో ప్రధానంగా కనిపిస్తూ వస్తున్నారు. డెమొక్రసీ ఎట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఈవిఎంస్? అనే ఆయన పుస్తకం 2010 జనవరి 1వ తేదీన విడుదలైంది.

ఎపిలో పార్టీని బలోపేతం చేయడానికే...
తెలుగుదేశం పార్టీతో దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై బిజెపి జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే జివిఎల్ నరసింహారావుకు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర బిజెపికి ఆయన జాతీయ స్థాయిలో పెద్ద దిక్కుగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications