బాబు వ్యూహం: హార్డ్ కోర్ ఔట్, జగన్కు దెబ్బ
హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా దెబ్బ తీసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఓ వైపు భూమా నాగిరెడ్డి వంటి కీలకమైన శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ మరో వైపు జగన్కు పూర్తి మద్దతు ఇస్తూ తమపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు శానససభకు దూరమయ్యేలా చంద్రబాబు వ్యూహం పన్నినట్లు అర్థమవుతోంది.
రోజాతో సహా ఐదుగురు శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ సిఫార్సు చేసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జీరో అవర్ సందర్భంగా రోజాసహా ఐదుగురు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తప్పుబట్టింది.
రోజాసహా ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలకు కమిటీ సిఫారసు చేసిందన్నారు. సామాజిక మీడియాకు అసెంబ్లీ వీడియోలు లీకైన అంశాన్ని సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేద్దామన్నా కమిటీ స్పందించలేదన్నారు. కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ డిసెంట్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.
కొడాలి నాని, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలి బుద్ధప్రసాద్ కమిటీ సిఫార్చు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రోజాతో పాటు మిగతా నలుగురిని కూడా శాసనసభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
దానివల్ల శాసనసభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున దూకుడుగా వ్యవహరించే శాసనసభ్యులు లేకుండా పోతారు. జగన్ దూకుడు కూడా దానివల్ల తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు, ఆ ఐదుగురి సస్పెన్షన్ వల్ల జగన్ను తీవ్రంగా దెబ్బ తీయవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.