హీరాఖండ్ ప్రమాదానికి కారణం ఇదీ: తలలులేని మొండేలు
హీరాఖండ్ రైలు ప్రమాదం ఘటనలో అత్యంత విషాదకరమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. పది తలలు లేని మొండాలను స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం: హీరాఖండ్ రైలు ప్రమాదం ఘటనలో అత్యంత విషాదకరమైన దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి పది తలలు లేని మొండేలు చేరుకున్నాయి. ఈ విషయంపై మాట్లాడడానికి జిల్లా అధికారులు ఇష్టపడడం లేదు.
ఏపీలో రైలు ప్రమాదం, ముందే పేలుడు తరహా శబ్ధం: ఐఎస్ఐ కుట్ర?
గుర్తు తెలియని శవాల ఫొటోలు ఇంటర్నెట్లో పెట్టామని, బంధువులు చూసి గుర్తు పట్టవచ్చునని అంటున్నారు. శవాలు నుజ్జునుజ్జైన దృశ్యాలు కూడా ప్రమాద తీవ్రతను సూచిస్తున్నాయి. ఆదివారంనాడు 24 శవాలను బంధువులకు అప్పగించారు. కేవలం వారు ధరించిన దుస్తుల ఆధారంగానే మృతదేహాలను గుర్తించే పరిస్థితి ఉంది.
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, కొంత మంది ఆస్పత్రికి వచ్చిన శవాలను చూసి వారు తమ బంధువులంటూ నష్టపరిహారం కోరుతున్నారని చెబుతున్నారు. దీంతో పేర్లు చెప్తే తప్పితే పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించడం లేదు.
ప్రమాదానికి కచ్చితమైన కారణం ...
విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో తప్పిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటనకు కచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. అయితే కుట్ర, విద్రోహం కారణం కావచ్చని రైల్వే అధికారులు మొదట చెప్పారు. కానీ తాజాగా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే ఘోరప్రమాదానికి దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు, రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్), జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్నాయి. ఎన్ఐఏ అధికారులతో పాటు ఏపీ సీఐడీ కూడా ప్రమాద స్థలిలో మకాం వేశారు. సీఐడీ చీఫ్ ద్వారకాతిరుమలరావు సోమవారం అక్కడ పర్యటించారు.
శవాలను వదిలేసి వెళ్లిపోయారు...
బీహార్కు చెందిన బాధిత కుటుంబాలు మృత దేహాలను తీసుకెళ్లే స్తోమత తమకు లేదని చెప్పారు. దీంతో ఏడుగురి మృతదేహాలకు రాయగడలో సామూహికంగా దహన సంస్కారాలు నిర్వహించారు. క్షతగాత్రులు రాయగడ, పార్వతీపురం, విశాఖపట్నం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ తెలిపా రు.
తాత్కాలిక మరమ్మతులు...
ప్రమాదం వల్ల రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్పై పడిపోయిన బోగీలను భారీ క్రేన్ల ద్వారా తొలగించారు. పట్టాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. సోమవారం ఉద యం 4.25కల్లా రాయగడ వైపు వెళ్లే లైనుపై రాకపోకలను పునరుద్ధరించారు. జోధ్పూర్ నుంచి విశాఖ వచ్చే ఎక్స్ప్రెస్ ఉదయం 6.10కి ట్రాక్పై తొలి రైలుగా నడిచింది. తర్వాత ఆ మార్గంలో నడిచే రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించాయి.
కుట్ర కోణం కానరాలేదు..
ప్రమాదంలో సంఘ విద్రోహ చర్యకు అవకాశం లేదని దర్యాప్తు బృందా లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. రైలు పట్టాల నిర్వహణ బాధ్యతను పర్యవేక్షించే సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ఉన్నతాధికారులు దర్యాప్తును సాగిస్తున్నారు. కూనేరు రైల్వేస్టేషన్ కేబిన్కు ఎదురుగా వున్నక్రాసింగ్ పాయింట్ వద్దే రైలు పట్టా విరిగి వుంది. ప్రమాదం జరగడానికి 25 నిమిషాల ముందు అదే పట్టాలపై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ గూడ్స్ రైలు స్టేషన్లోనే ప్లాట్ఫారాన్ని ఆనుకొని ఉన్న లూప్లైన్లో నిలిచి ఉంది.
ఆ తర్వాతే ప్రమాదం..
ఆతర్వాత మెయినలైన్పై వచ్చిన హిరాఖండ్ రైలు అదే పట్టాలపై ప్రమాదానికి గురైంది. ఈ 25 నిమిషాల వ్యవధిలో సంఘ వ్యతిరేక శక్తులు పట్టాలను ధ్వంసం చేసే అవకాశం తక్కువగా ఉంటుందని అంటున్నారు. అలా చేయాలనకుంటే వారు ముందుగానే ప్రణాళిక వేసుకుని, అవసరమైన పరికరాలతో వచ్చి వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు.. అలా వచ్చినా సరే పట్టాను విరగ్గొడుతున్నపుడు శబ్దం వస్తుంది. క్రాసింగ్ పాయింట్ ఎక్కడైనా కేబిన్కు ఎదురుగానే వుంటుంది. అక్కడ ఏం జరుగుతున్నా కేబిన్లోని ఆపరేటర్కు కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా పట్టా విరగ్గొట్టడానికి ప్రయత్నిస్తే దాన్ని అతడు గుర్తించి స్టేషన మాస్టర్కు తెలియజేస్తాడు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని అంటున్నారు. ఆ లైనను పెట్రోలింగ్ గ్యాంగ్మెన తనిఖీ చేసి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
వర్షాకాలంలోనే గ్యాంగ్ మెన్ పనిచేస్తారు...
రైల్వేలో వర్షాకాలంలోనే పెట్రోలింగ్ గ్యాంగ్మెన్ పనిచేస్తారు. వర్షాలకు చెరువుల్లోని నీరు పట్టాల కిందకు వచ్చి రాళ్లు కొట్టుకుపోతే వాటిని గుర్తించి ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేస్తారు. కూనేరు వంటి మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లోను ఇలాంటి గ్యాంగ్మెన్ ఉంటారు. వారు ఎక్కడకు తనిఖీకి వెళ్లినా రిజిస్టర్ నిర్వహిస్తారు. కూనేరులో తనిఖీలు చేసి ఉంటే ఆ రిజిస్టర్లో ఏం రాశారనేది కీలకమైన విషయంగా మారుతుంది. ప్రమాదం జరిగిన సంఘటనకు కొద్ది అడుగుల దూరంలోనే కీమ్యాన్(క్యాబిన్ మెన్) అప్పారావు విధుల్లో ఉన్నారు.
వారి విచారణ...
ప్రమాదం విద్రోహ చర్య కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని సీఐడీ అదనపు డీజీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు కూడా వ్యక్తం చేశారు. విరిగిన పట్టాను ఆయన పరిశీలించారు. పట్టా విరిగిందా, లేక కోసేశారా అని ఆయనను ప్రశ్నించగా, ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు. ఐదు బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నట్లు సీఐడీ ఐజీ అమిత్గార్గ్ తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ట్రాక్మెన్, స్టేషన్ మాస్టర్తోపాటు మరికొంతమందిని విచారించారు.
ప్రమాదం శీతాకాలం ఎఫెక్టెనా..
శీతాకాలంలో పట్టాలు సంకోచించి వ్యాకోచిస్తుంటాయి. దానివల్ల పగుళ్లు సంభవిస్తాయి. వాటిపై బరువు పడినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. శనివారం రాత్రి కూడా అలాగే పట్టా విరిగిపోయి ఉండవచ్చునని రైల్వే అధికారులు భావిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన శీతాకాలపు రైలు ప్రమాదాల్లో పట్టాలు పగుళ్లు ఇవ్వడం వల్ల జరిగినవే ఎక్కువని అంటున్నారు.