అర్ధరాత్రి భర్త గొడవ, సనా ఒంటిపై గాయాలు: అసలేం జరిగింది? తల్లి ఏం చెప్పింది?
హైదరాబాద్: నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.
Recommended Video
సనా ఓ సాహసి: స్ఫూర్తి పాఠం ఈ హైదరాబాదీ బైకర్, 38వేల కి.మీల ఒంటరి ప్రయాణం
ప్రమాదమేనంటూ పోలీసులు..
అయితే, సనా మృతికి ప్రధాన కారణం ప్రమాదమే అని పోలీసులు తేల్చారు. కారు వేగంగా వెళుతూ మలుపు వద్ద నియంత్రించడం సాధ్యం కాకపోవడంతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. కారు డివైడర్పైకి ఎక్కిన సమయంలో ఏర్పడిన టైర్ల గుర్తుల నమూనాలు, ఫొటోలను నార్సింగ్ పోలీసులు సేకరించారు. ఇది పూర్తిగా ప్రమాదమే అని అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని నార్సింగ్ ఎస్ఐ సుధీర్కుమార్ వివరించారు. సనా భర్త అబ్దుల్ నదీమ్కు పక్కటెముకలు నాలుగు, ఎడమచెయ్యి ప్రాక్చర్ అయ్యాయని వైద్యులు తెలిపారని చెప్పారు.
హత్యారోపణలపై దర్యాప్తు..
సనాను ఎక్కడో చంపేసి తీసుకొచ్చి యాక్సిడెంట్ చేశారని తల్లి షహీమ్ఖాన్ ఫిర్యాదు చేశారని, దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు, మృతురాలి తల్లి స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఏమైనా తేలితే దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో తగిలిన దెబ్బల తీవ్రత లేదా ఇతర ప్రాంతంలో ముందే కొట్టిన దెబ్బలు ఉన్నా పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని పోలీసులు అంటున్నారు. ఆమె భర్త కాల్ రికార్డ్ ఆధారంగా సనా కుటుంబ సభ్యులను విచారిస్తామన్నారు. భార్య అంత్యక్రియల్లో అంబులెన్స్లో వచ్చి పాల్గొంటానని.. రక్షణ కల్పించాలని అబ్దుల్ నదీమ్ నార్సింగ్ పోలీసులను కోరగా... అంత్యక్రియలు జరిగే ప్రాంతం తమ పరిధిలోకి రాదని, వేరే పీఎస్ నుంచి అనుమతి తీసుకోవాలని అతడికి చెప్పారు.
ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు తరచుగా కలుసుకునే వారు. వారి రెండేళ్ల కొడుకు కొన్ని రోజులు తల్లి దగ్గర, మరి కొన్ని రోజులు తండ్రి వద్ద ఉండేవాడట. మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో సనా ఇక్బాల్ భర్తకు ఫోన్ చేసిన కాల్.. ఆమె లాస్ట్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున మూడు గంటల తర్వాత తిరిగి ఇంటికి వేగంగా వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ రోజు రాత్రి కారులో కొత్తగా ఏర్పాటు చేయించుకున్న మ్యూజిక్ సిస్టమ్ ద్వారా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తిరిగారని భర్త పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
అంతిమ యాత్ర... బైక్ రైడర్స్ ర్యాలీ
కాగా, దక్షిణాఫ్రికాలో ఉన్న సనా చెల్లి కోసం సాయంత్రం 4.30గంటల వరకు మృతదేహాన్ని హల్హస్నాత్నగర్ కాలనీలోని ఇంట్లో ఉంచారు. ఆ తర్వాత సనా ఇక్బాల్ అంతిమయాత్ర టోలీచౌకి హల్హస్నాత్నగర్ కాలనీ నుంచి బదార్ఘాట్ శ్మశాన వాటిక వరకు కొనసాగింది. 50మంది బైక్రైడర్స్ ఆమె మృతికి సంతాపంగా నల్ల డ్రెస్లు ధరించి ర్యాలీగా యాత్ర ముందు వెళ్లారు. సాయంత్రం 4.30 గంటలకు హల్హస్నాత్నగర్ కాలనీ నుంచి నానాల్నగర్ చౌరస్తా, రేతిబౌలి, మెహిదీపట్నం, హుమయూన్నగర్, మాసబ్ట్యాంక్, విజయనగర్ కాలనీ మీదుగా బదార్ఘాట్ శ్మశాన వాటికకు చేరింది. అక్కడ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
ఇంటికొచ్చి సనాతో భర్త గొడవ..
నదీమ్ నా కుమార్తెను కక్షతో పథకం ప్రకారమే హత్య చేశాడని సనా తల్లి ప్రొఫెసర్ షాహిన్ఖాన్ ఆరోపించింది. సనా చిన్నప్పటి నుంచి బైక్రైడర్గా రాణించిందని, నగరంలో బైక్రైడర్ క్లబ్లో చేరి ఉద్యోగం చేసిందని చెప్పారు. వివాహం అయిన తర్వాత రెండు, మూడు నెలల వరకు సనా ఇక్బాల్ జీవితం ప్రశాంతంగా గడిచిందని, ఆ తర్వాత భర్త నదీమ్ ఆమెను హింసించడం ప్రారంభించాడని ఆరోపించారు. ‘నదీమ్ చిత్రహింసలకు గురిచేస్తుండడంతో అప్పటి నుంచి అతడితో దూరంగా ఉంటున్నాం. ఇంటికి రావొద్దని ఎన్నోసార్లు చెప్పినా. అర్ధరాత్రివేళ ఇంటి వద్దకొచ్చి కాలనీలో ఉన్నవారికి ఇబ్బంది కలిగించేలా హారన్లు కొట్టడం, రాళ్లు రువ్వడం చేసేవాడు. దీనిపై హుమయూన్నగర్ పోలీసులకు సనా రెండుసార్లు ఫిర్యాదు చేసిందని ఆమె చెప్పారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నదీమ్ సైకోలా మారాడు. తాను చనిపోతే దానికి తన భర్తే కారణమని పలుమార్లు నాతో సనా చెప్పింది' అని షాహిన్ ఖాన్ కన్నీటిపర్యంతమయ్యారు. క్రిడెట్ కార్డుపై ఐదులక్షల అప్పు ఇప్పించమని వెంటపడ్డాడని, ఈ విషయపై పలుమార్లు గొడవపడ్డాడని తెలిపారు.
సనాది ముమ్మాటికీ హత్యే..
‘పోలీసులు నదీమ్పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై కొడితే కమిలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తే విషయం తెలుస్తుంది' అని సనా తల్లి తెలిపారు. కారులో సనా ఇక్బాల్ చేతులు కట్టి ఉన్నట్లు, ఆమె చెవికి ఉన్న రింగులను తెంచి ఉండడంతో చెవి కోసుకుపోయినట్లు ఉందని తెలిపారు. ‘ఆ రోజుకు కొడుకుని తీసుకుని ఉద్యోగానికి వెళ్లిన సనా రాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చింది. నదీమ్ ఆమెను గమనించి కారులో ఇంటికి వచ్చి వాహనాన్ని సనా ముందు ఆపాడు. తనతో పాటు రావాలని ఘర్షణకు దిగాడు. ఇదంతా మేము పైనుంచి చూస్తున్నాం' అని షాహిన్ఖాన్ తెలిపారు. కాగా, ‘నదీమ్ ఘర్షణ భరించలేక కొడుకును ఇంట్లో విడిచిపెట్టి భర్తతో వెళ్లిన గంటలోపే మృతి చెందింది. పథకం ప్రకారమే ఇదంతా జరిగింది ' అని కన్నీటిపర్యాంతమయ్యారు. నదీమ్ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సనా తల్లి షాహిన్ఖాన్ కోరారు.