విదేశాల్లో 12 ఏళ్లు: ఎవరీ ఉగ్రవాది అజీజ్?
హైదరాబాద్: పన్నేండుళ్లుగా విదేశాలలో తలదాచుకుంటున్న మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదిని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయిన అజీజ్ అలియాస్ గిడ్డూ 2004లో నమోదైన కుట్ర కేసులో నిందితుడు. అతను పోలీసులకు చిక్కకుండా పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డూను సౌదీ పోలీసులు భారత్కు పంపించడానికి అంగీకరించడంతో లక్నోకు వస్తున్నాడు. నకిలీ పాసుపోర్టు కేసులో సౌదీ జైల్లో ఉంచిన గిడ్డూను ఆ దేశ పోలీసులు భారత్కు పంపించారు. సౌదీ నుంచి నేరుగా లక్నో వెళ్లే విమానంలో పంపిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న నగర పోలీసులు అక్కడకు బయలు దేరారు.
హైదరాబాదులోని భవానీనగర్కు చెందిన అబ్దుల్ అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్లో మేనేజర్గా పనిచేశాడు. ఆ సమయంలో నిషేధిత స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ అఫ్ ఇండియా(సిమి)కి చెందిన ఉగ్రవాది మొహ్మద్ ఫసీయుద్దీన్ అలియాస్ ఫసీ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు.
ఆ కాలంలోనే పాక్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తొయిబా అనుబంధంగా నగరానికి చెందిన ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ప్రతినిధులతో చేతులు కలిపాడు. ఈ సందర్భంగా 2000 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజం ఘోరీ మృతి చెందాడు.
ఈ ఘటన తరువాత అజీజ్ సౌదీ అరేబియాకు పారిపోయి, అక్కడ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ అర్గనైజేషన్ అనే సంస్థలో చేరాడు. జీహాదీ వాలంటీర్లతో కూడిన ఈ సంస్థలో అజీజ్ చురుకుగా పనిచేశాడు. ఆ సంస్థ నుంచి సుమారు రూ. 10 లక్షల వరకు సేకరించి, ఆ డబ్బుతో నగరానికి చెందిన యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ, విధ్వంసాలకు వ్యూహరచనలు చేశాడు.
బోస్నియా-చెచెన్యాలలో జరిగే అంతర్యుద్దాలకు ఆకర్షితుడై అక్కడకు వెళ్లి వచ్చాడు. 1995లో బోస్నియాలో తన అసలు పేరుతోనే పాస్పోర్టు పొందాడు. అనంతరం 2000 సంవత్సరంలో నగరంలో అబ్దుల్ కరీం పేరుతో నకిలీ పాస్పోర్టు పొందాడు. విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నారనే అభియోగాలపై నగర పోలీసులు అజీజ్ను 2001లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో జీహాదీ సాహిత్యం, తుపాకీ పేలుడు పదార్ధాలు, నకిలీ పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన తరువాత సౌదీ అరేబియాకు పారిపోయాడు. మూడేళ్ల పాటు సౌదీలోనే ఉన్న అజీజ్ 2004లో హైదరాబాద్ వచ్చాడు. నగరానికి చెందిన మరికొందరితో కలిసి సికింద్రాబాద్లోని గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నడంతో పాటు వినాయక చవితి ఉత్సవాల్లో పేలుళ్లు జరుపాలనే కుట్ర పన్నారని టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఈ ముఠాను అరెస్ట్ చేశారు.
సూత్రదారిగా బావించిన అజీజ్ అప్పట్లో పోలీసులకు చిక్కకుండా దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి సౌదీలోనే ఉంటున్నాడు. అజీజ్ వద్ద ఉన్న నకిలీ పాస్పోర్టు విషయాన్ని తెలుసుకున్న సౌదీ పోలీసులు 2007లో అక్కడ అరెస్ట్ చేశారు. అనంతరం అజీజ్పై ఇంటర్పోల్ రెడ్కార్నర్ జారీ అయ్యింది. సౌదీలో శిక్షా కాలం పూర్తి కావడంతో సౌదీ ప్రభుత్వం అజీజ్ను భారత్కు డిపోర్ట్ చేసింది. సోమవారం రాత్రికి లక్నోకు చేరుకోనున్నాడు. ఇతనిని నగరానికి తీసుకువచ్చేందుకు నగర పోలీసుల బృందం లక్నోకు బయలుదేరింది.