విశ్వసనీయత దేశాల్లో భారత్ రెండోస్థానం, పత్రికల్లోను
దావోస్: ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత దేశం రెండోస్థానంలో ఉంది! వ్యవస్థల పైన విశ్వసనీయత ఆధారంగా ఓ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత తగ్గినప్పటికీ.. భారత్ స్థానం మెరుగైంది.
ఎడెల్మాన్ అనే పౌర సంబంధాల సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఏడాది కాలంలో భారత్ మూడు స్థానాలు ఎగబాకి 27 దేశాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత దేశంలో 79 శాతం మంది సంతృప్తితో ఉన్నారని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రాన్ని ఈ సంస్థ మొదటి పేజీలో ప్రచురించింది.
యూఏఈ, భారత్, చైనా, సింగపూర్, నెదర్లాండ్స్ వంటివి విశ్వసనీయ దేశాల్లో నిలిచాయి. జపాన్, రష్యా, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, ఇటలీ వంటి 13 దేశాలు విశ్వసనీయతను కోల్పోయాయి. తటస్థంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్, ఫ్రాన్స్, అమెరికా, మలేషియాలు ఉన్నాయి.
యూఏఈ 84 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఇండోనేషియా 78 పర్సెంట్, చైనా 75 పర్సెంట్, సింగపూర్ 65 పర్సెంట్, నెదర్లాండ్స్ 64 పర్సెంట్గా ఉంది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల పైన విశ్వాసం వ్యక్తం చేసిన వారు 48 శాతం. భారత దేశంలో రాజకీయ నాయకుల పైన విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో 82గా ఉంది. 2014లో భారత దేశంలో రాజకీయ నాయకుల పైన విశ్వాసం వ్యక్తం చేసిన వారిలో 53 శాతం ఉంటే, ఇప్పుడు అది 82కు పెరిగింది.
భారతదేశం సహా పదహారు దేశాల్లో ప్రభుత్వం పైన నమ్మకం పెరిగింది. ఇక ప్రభుత్వేతర సంస్థల పైన విశ్వాసం 75 శాతంకు పెరిగింది. సగానికి పైగా దేశాల్లో పత్రికల పైన నమ్మకం తగ్గిపోగా, భారత దేశంలో మాత్రం ఇది 76 శాతంగా ఉంది. గతంలో ఇది 71 శాతంగా మాత్రమే ఉండింది.