దీపావళి జోష్: ఇన్ఫోసిస్లో వీరికి నిజంగా పండుగే
బెంగళూరు: ఈ దీపావళి నిజంగానే ఇన్ఫోసిస్ ఉద్యోగులు పండుగ చేసుకునే సంఘటన చోటు చేసుకుంది. దేశంలో రెండో అతి పెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. అంచనాలకు మించి లాభాలు ఆర్జించడంతో ఇన్ఫోసిస్ యాజమాన్యం భారీగా పరిహారాలు పెంచింది.
టాప్ ఎగ్జిక్యూటివ్కు, అద్భుత పనితీరును ప్రదర్శించిన ఉద్యోగులకు భారీగా పరిహారాలు ప్రకటించింది. మేనేజర్ స్థాయిలో ఉన్న ఎనిమిది మందికి వేతన ప్యాకేజీలను సవరించింది. వీరిలో సిఎఫ్వో ఎండి రంగనాథ్, ప్రెసిడెంట్స్ మోహిత్ జోషీ, సందీప్ డాడ్లానీ, రాజేష్ కె మూర్తి, రవి కుమార్ ఎస్, జనరల్ కౌన్సిల్ చీఫ్ కంప్లీయన్స్ ఆఫీసర్ డేవిడ్ కెనెడీ, హెచ్ఆర్ హెడ్ కృష్ణమూర్తి, శంకర్, కంపెనీ సెక్రటరీ మణికాంత్ ఎజెఎస్ల ఉన్నారు.
నవంబర్ 1వ తేదీ నుంచి ఈ పరిహారాలు అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎక్కుగా ఈ పరిహారాలను స్టాక్ ఆప్షన్లు, వేరియబుల్ పరిహారాల కింద కంపెనీ మంజూరు చేసింది. సవరించిన వేతనాల ప్రకారం ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్లకు స్థిరమైన పరిహారం కింద రూ. 24 కోట్లు, వేరియబుల్ పరిహారం కంద రూ. 20 కోట్లు పొందుతారు.
అదనంంగా 2016 ఆర్థిక నిర్వహణలో భాగంగా రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (ఆర్ఎస్యులు) 2.45 లక్షలు, స్టాక్ ఆప్షన్లు 5.02 లక్షలను నవంబర్ 1 నుంచి కంపెనీ వారికి మంజూరు చేసింది. అదే విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 425 మంది ఉద్యోగులకు 906,275 ఆర్ఎస్యులు, 943,810 స్టాక్ ఆప్షన్లను కంపెనీ మంజూరు చేసింది. అవి నాలుగేల్ల వరకు అందుబాటులో ఉంటాయి.
సూర్య సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు, సిఈవో డిఎన్ ప్రహ్లాద్ను బోర్డులో స్వతంత్ర డైరెక్టరుగా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి సమీపం బంధువని సమాచారం. ఈ నియామకం అక్టోబర్ 14వ తేదీనుంచే అమలులోకి వచ్చింది.