బహిరంగ వ్యాఖ్యలు: చంద్రబాబు పట్టు తప్పిందా?
హైదరాబాద్: అపర చాణక్యుడిగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వపక్షం నుంచే విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులే వ్యాఖ్యలు చేయడం విచిత్రమనిపించడమే కాకుండా, పార్టీ నేతలపై ఆయన పట్టుకోల్పోతున్నారా అనే అనుమానాలకు తావు ఇస్తోంది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.ఆ స్థితిలో చంద్రబాబు వ్యవహార శైలిపై స్వపక్షం నుంచే విమర్శలు వస్తున్నాయి.
రాజధాని ఏర్పాటు విషయం మొదలుకుని, ఎమెల్సీ సీట్ల కేటాయింపు వరకు ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి పార్టీలో గూడు కట్టుకుపోయినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ధ్వజమెత్తడం, దీనికి చంద్రబాబు బదులివ్వడం పార్టీలో, ప్రభుత్వంలో ఉన్న అసంతృప్తి బయట పడినట్లయింది.
మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా తాజాగా చంద్రబాబుపై బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో లేనప్పుడు మన అధికారులను ఎక్కడికెక్కడికో పంపారని, ఇప్పుడు తీసుకువస్తే తప్పేముందని? బదిలీలను ఉద్దేశించి అన్నారు. విజయనగరానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి కూడా ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ వైద్యకళాశాలను కేటాయిస్తామని గతంలో చెప్పి, ఇప్పుడు ప్రైవేట్ కాలేజీని మంజూరు చేస్తామనడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంచివారంటూనే తమను పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
విజయవాడ టిడిపి ఫైర్బ్రాండ్ పంచుమర్తి అనురాధ తనకు రెండేళ్లకు పదవీకాలం ముగిసే ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తే నామినేషన్ వేయడానికి తిరస్కరించారు. అనురాధకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడానికి కృష్ణా జిల్లాలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యమే కారణమని తెలుస్తోంది. ఎంపి శివప్రసాద్ కూడా ఇటీవల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ కంటే కోస్తాంధ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మహానాడు జరుగుతుంది. సాధారణంగా మహానాడులో పార్టీ విధానాలు, అంతర్గతంగా పార్టీని బలోపేతం చేయడంపై ఉపన్యాసాలు ఉంటాయి. ఎవరెన్ని ఉపన్యాసాలు చేసినా, మహానాడు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడి ఆధిపత్యం సహజంగానే ఉంటుంది. ఈసారి మహానాడు తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన ఉంటుందనే మాట వినపడుతోంది.
కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కెఇకృష్ణమూర్తి ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా గుంటూరు జిల్లాను ఖరారు చేసినప్పటి నుంచి ఏదో ఒక రకంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కర్నూలు జిల్లాలో టిడిపికి మూడు సీట్లు మాత్రమే వచ్చాయనే అసంతృప్తిని చంద్రబాబు పలుసార్లు వ్యక్తం చేశారని కెఇ అన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా ప్రభుత్వ అధికారుల బదిలీలపై బహిరంగంగా వ్యాఖ్యానించడం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.