పాక్ ఐఎస్ఐపై టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీ షాకింగ్ అంశాలు
న్యూఢిల్లీ: 26/11 కేసు నిందితుడు, పాకిస్తాన్ - అమెరికన్ తీవ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఉగ్రవాదానికి మూలం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ కారణమని చెప్పాడు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహ్మద్, హిజుబుల్ సంస్థలకు అన్ని విధాలా సహకరిస్తుందన్నాడు.
ఆర్థిక, నైతిక, సైనిక సాయాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ అందిస్తుందన్నాడు. భారత రక్షణ శాస్త్రవేత్తల సదస్సు పైన దాడి చేద్దామనుకున్నట్లు చెప్పాడు. అలాగే ముంబై సిద్దివినాయక ఆలయం పైన రెక్కీ జరిపినట్లుగా అతను చెప్పాడు. ఐఎస్ఐకి చెందిన వారిని కలిసినట్లు చెప్పాడు.
ముంబై దాడుల (26/11) కేసులో కీలక నిందితుడిగా ఉన్న హెడ్లీ.. వరుసగా రెండోరోజైన మంగళవారం అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం సమర్పించాడు.
నేను పాకిస్థాన్ నిఘావిభాగం ఐఎస్ఐ తరఫున, ఉగ్రవాదసంస్థ లష్కరే తోయిబా తరఫున పని చేసేవాడినని, ముంబై దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన లష్కరే కీలకనేత జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ ఐఎస్ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్ నియంత్రణలో ఉండేవాడని చెప్పాడు.

పాక్ సైన్యంలో పనిచేసే కల్నల్ షా, లెఫ్టినెంట్ కల్నల్ హమ్జా, మేజర్ సమీర్ అలీ తదితర అధికార్లను నేను కలుసుకున్నానని, లష్కరే తోయిబా, అల్ ఖైదాలతో పాక్ మాజీ సైనికాధికారి అబ్దుల్ రెహ్మాన్ పాషా సన్నిహితంగా పని చేసేవాడని తెలిపాడు.
ఈయనను లాహోర్లోని ఒక మసీదులో 2003లో కలుసుకున్నానని, అప్పట్లో ఆయన లష్కరే తోయిబాతో కలసి పనిచేసేవాడని, ఆ తర్వాత లష్కరేను వదిలిపెట్టి అల్ఖైదాలో చేరాడన్నాడు. 2006లో మేజర్ ఇక్బాల్ అనే మరో సైనికాధికారిని లాహోర్లో కలిశానని, భారత సైనిక నిఘావ్యవహారాల రహస్యాలను సేకరించే పనిని ఆయన నాకు అప్పగించాడన్నాడు.
పాకిస్థాన్కు సమాచారం అందించేవిధంగా భారత సైన్యంలోని వ్యక్తులను గూఢచారులుగా నియమించే అదనపు బాధ్యతలు కూడా అప్పగించాడని, సమీర్ అలీ అనే మరో సైనికాధికారి కూడా నన్ను ఇదే పని చేయమన్నాడని, జైష్ ఏ మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్తోనూ తనకు పరిచయం ఉందన్నాడు.
2003 అక్టోబర్లో ఒక బహిరంగసభలో ఆయనను చూశానని, తన అంచనా ప్రకారం లష్కరే తోయిబా, ఐఎస్ఐ పరస్పర సహకారంతో, సమన్వయంతో పని చేస్తుంటాయన్నాడు.26/11 దాడులకు ఏడాది ముందే ప్రణాళికలు మొదలైనట్లు చెప్పాడు. కాగా, ఆయన వాంగ్మూలం బుధవారం కూడా కొనసాగనుంది.












Click it and Unblock the Notifications