109/119 : టీఆర్ఎస్కు తిరుగులేదంటోన్న తాజా సర్వే
హైదరాబాద్ : మొన్నటికి మొన్న ఫాంహౌజ్ లో నిర్వహించిన సమావేశంలో.. పార్టీ తరుపున చేయించుకున్న సర్వేల గురించి చెబుతూ.. రాబోయే ఎన్నికల్లో 'టీఆర్ఎస్ కు తిరుగులేదు' అని తేల్చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాజాగా మరో సర్వే కూడా తెలంగాణలో పాలిటిక్స్ అన్నీ వన్ సైడ్ గానే ఉన్నట్లు తేల్చేసింది.
సెంటర్ ఫర్ సెఫాలజీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనుక జరిగితే.. ప్రస్తుతం 119 స్థానాలుగా ఉన్న తెలంగాణలో 109 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తాయంటూ సర్వే స్పష్టం చేసింది. దీంతో టీఆర్ఎస్ నేతలకు ఇది మరింత బూస్టింగ్ ఇచ్చే అంశంగా మారింది.
సర్వేపై మంత్రుల స్పందన
సెంటర్ ఫర్ సెఫాలజీ సర్వేపై తెలంగాణ మంత్రులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పనితీరుకు, టీఆర్ఎస్ ప్రజాహిత పాలనకు ఈ సర్వేనే నిదర్శమని చెబుతున్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పనిచేస్తున్న తీరుపై తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉందని, ఇదే విషయం సర్వే ద్వారా కూడా స్పష్టమైందంటున్నారు.

దేశంలో నంబర్ వన్ సీఎం కేసీఆర్ : జగదీశ్వర్ రెడ్డి
'మన ముఖం ఎలా ఉంటుందో.. అద్దంలోను అలాగే కనిపిస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోన్న పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టే.. సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయి' అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రస్తుత రాజకీయాల్లో దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ సీఎం అంటూ కితాబిచ్చారాయన.
బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ పైనే ప్రజలకు విశ్వాసం
బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమైందని, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలంతా పూర్తి సంతృప్తితో ఉన్నారు కాబట్టే సర్వేలో ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక, పాలేరు ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఇలా ప్రతీ ఎన్నికలోను ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడుతూ రావడానికి కారణం.. పార్టీపై, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసమే కారణమి హరీశ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications