మూడు ముక్కలాట: విశాఖలో విజయమ్మ
హైదరాబాద్: విశాఖపట్నం లోకసభ స్థానం విషయంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోంది. ఈ సీటు నుంచి వైయస్ జగన్ తన సోదరి వైయస్ షర్మిలను పోటీకి దించుతారా ఓసారి, తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని పోటీ చేయిస్తారని మరోసారి ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా, విశాఖపట్నంలో జగన్ తన తల్లి వైయస్ విజయమ్మను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైయస్ షర్మిల విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి, వైయస్ విజయమ్మ తూర్పు గోదావలి జిల్లా అనపర్తి శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తారని ఇటీవలి దాకా ప్రచారం సాగింది. అయితే, షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని, విజయమ్మను విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీకి దించుతారని తాజా సమాచారం.
కానీ, ఈ నెల 17వ తేదీన విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి నామినేషన్ వేసేందుకు వైవి సుబ్బారెడ్డి సమాయత్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతను చూసుకోవాలని జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి చెబుతున్నారని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు లోకసభ స్థానానికి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
కాగా, విశాఖపట్నం నుంచి తెలుగుదేశం, బిజెపి కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. బిజెపి నుంచి హరిబాబు లేదా పురంధేశ్వరి విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం గంటా శ్రీనివాసరావు పేరును సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం లోకసభ అభ్యర్థిగా విజయమ్మ పేరును జగన్ శనివారంనాడు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. వైయస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి, అవినాష్ రెడ్డి కడప లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులుగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 16 లేదా 17వ తేదీన జగన్ నామినేషన్ వేసే అవకాశాలున్నాయి.