రాజధానికి డిజైన్: ఎవరీ మకీ అండ్ అసోసియేట్స్?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణాలకు ప్రణాళికలను జపాన్కు చెందిన మకీ అండ్ అసోసియేట్స్ రూపొందించిన డిజైన్ ఉత్తమ డిజైన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆరుగురు అంతర్జాతీయ ప్రముఖులతో కూడిన జ్యూరీ దీనిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. శాసనసభ, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణలకు ప్రణాళికలు అందజేసిన 'మకీ అండ్ అసోసియేట్స్' సంస్ధ ప్రపంచంలోనే పలు గొప్ప నిర్మాణాలకు డిజైన్ను అందించింది.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ల్యాబ్, వరల్డ్ ట్ర్రేడ్ సెంటర్-4, ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ భవనం, బీహార్లోని మ్యూజియం ఇలా ఏడు ఖండాల్లోని ఎన్నో భవనాల నిర్మాణానికి ఈ సంస్థే ఆకృతిని ఇచ్చింది. జపాన్లోని టోక్యోకు చెందిన మకీ అండ్ అసోసియేట్స్ మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తక్కువ విస్తీర్ణంలో డిజైన్ను అందిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గొప్ప సంస్ధలకు అద్భుతమైన డిజైన్లను అందించిన ఈ సంస్ధలో ఉద్యోగులు కేవలం 45 మంది మాత్రమే. వీరిలో ఆర్కిటెక్ట్లు, డిజైనర్లు తదితరులు ఉన్నారు. 1965లో మకీ అండ్ అసోసియేట్స్ సంస్ధను 'పుమిహికో మకీ' ఏర్పాటు చేశారు.
1954లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో డిజైన్లో పట్టభద్రులైన మకీ కొన్నేళ్లపాటు అక్కడే ఆర్కిటెక్ట్గా పనిచేశారు. అనంతరం జపాన్ వచ్చి సొంతగా సంస్ధ ఏర్పాటు చేశారు. టొక్యోలోని తన సంస్ధలో ఉన్న 45 మంది సిబ్బందితో కలిసి మకీ కూడా పనిచేస్తుంటారు.
మకీ ప్రతి ప్రాజెక్టులో కూడా లీడ్గా ఉంటూ తోటి ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఈ సంస్ధ పనితీరు, నాణ్యత గుర్తిస్తూ పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి పురస్కారాలను సైతం అందుకున్నారు. ఇకా సంస్ధ గతంలో మ్యూజియాలు, సమావేశ మందిరాలు, విద్య, లైబ్రరీ, పరిపాలనా కార్యాలయాలకు సంబంధించిన డిజైన్లను అందించిన అనుభవం ఉంది.
పరిపాలన ప్రాజెక్టులు:
* న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి భవనాన్ని 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే డిజైన్
* టోక్యోలో 41,150 చదరపు మీటర్ల నిర్మిత స్థలంలో న్యూమచీడా సిటీ హాల్ నిర్మించే డిజైన్

ఆఫీసు ప్రాజెక్టులు:
* లెబనాన్లోని బీరూట్ బ్లాక్. 48200 చదరపు మీటర్ల వైశాల్యంలో కార్యాలయ, వ్యాపార భవనం
* న్యూయార్క్లో 23 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్-4
* 3.29 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో న్యూయార్క్లోని ఆస్టోర్ ప్యాలెస్
* టోక్యో కౌటోకులో 11042 చదరపు మీటర్ల వైశాల్యంలో రోలెక్స్ టొయోకో బిల్డింగ్
* జర్మనీలోని మ్యూనిచ్లో 68,366 చదరపు మీటర్ల వైశాల్యంలో ఇసారోబూరో పార్కు
రీ బిల్డింగ్ ప్రాజెక్టులు:
* తైవాన్లోని తైపీలో దాదాపు 5.5 లక్షల చదరపు మీటర్ల స్థలంలో తైపీ ప్రధాన రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి డిజైన్
* ఫ్రాన్స్లో సెయింట్ ఎటినీలో తొలిదశ కింద 16,400 చదరపు మీటర్ల స్థలంలో ఛటె ఆక్రూక్స్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు డిజైన్
రాజధాని పరిపాలనా భవనాల డిజైన్ పోటీలో రిచర్డ్ రోజర్స్ (బ్రిటన్)- రోజర్స్ స్ట్రిక్ హార్బర్ అండ్ పార్ట్నర్స్, బి.వి.దోషి(భారత్)-వాస్తుశిల్ప కన్సల్టెన్ట్స్, ఫ్యుమిహికో మకీ (జపాన్)-మకీ అండ్ అసోసియేట్స్ పాల్గొన్నారు. చివరకు మకీ అండ్ అసోసియేట్స్కు చెందిన డిజైన్ను ఏపీ ప్రభుత్వం ఓకే చేసింది.
2018 డిసెంబరు నాటికి ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. వీటిలో శాసనసభ, హైకోర్టులను 'ఐకానిక్' భవనాలుగా నిర్మించనుంది. ఈ రెండు భవనాల నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2017 మేలో మొదలు పెట్టి 2018 డిసెంబరుకి వీటి నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.
రాజధానిలో 900 ఎకరాల్లో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మిస్తున్నారు. వీటిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవన్, ముఖ్యమంత్రి నివాసం, శాఖాధిపతుల కార్యాలయాలతో పాటు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటివన్నీ ఉంటాయి.












Click it and Unblock the Notifications