జయలలిత: పాలనపై తర్జన, అంతటితో సరిపెట్టేనా?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరికొద్ది రోజులు అపోలో ఆసుపత్రిలో ఉండవలసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో పాలన పడకేసిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పగ్గాలు ఎవరికి అప్పగించాలి? ఉప ముఖ్యమంత్రిని ఎంపిక చేస్త్రారా? అనే చర్చ సాగుతోంది.
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మార్పు పైన తీవ్ర తర్జన భర్జన కొనసాగుతోంది. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పైన పునరాలోచన చేశారని అంటున్నారు. జయలలిత శాఖలు ఇతర మంత్రులకు బదలీ చేసి, అంతటితో సరిపెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది.
మంత్రులు పన్నీర్ సెల్వం, పళణిస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రావు శుక్రవారం ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో చర్చించారు. అయితే, జయ గైర్హాజరీలో ఉప ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారన్న దానిపై పార్టీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉప ముఖ్యమంత్రి పదవి ఒకరికిస్తే, మిగిలిన సీనియర్లు అలుగవచ్చునని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తే కార్యకర్తలకు, ప్రజలకు మరో రకమైన సంకేతాలు కూడా వెళ్తాయని అనుమానిస్తున్నారు. గతంలో ఎంజీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అస్వస్థతకు గురయ్యారు.
ఆయన శాఖల బాధ్యతలను సీనియర్ మంత్రులు ఒక్కొక్కటి స్వీకరించారు. ఇప్పుడూ జయలలిత వద్ద ఉన్న శాఖలను సీనియర్ మంత్రులు పంచుకుని, పాలన సాగేలా చూస్తే బాగుంటుందని అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న జయ సన్నిహితురాలు శశికళకు నేతలు చెప్పారని సమాచారం.
ప్రస్తుతం జయలలిత ఆధీనంలో హోంశాఖ, పబ్లిక్, ఐఏఎస్, ఐపీఎస్, అటవీశాఖ, సాధారణ పరిపాలన, డిస్ట్రిక్ట్ రెవెన్యూ శాఖలున్నాయి. వీటి ఫైళ్లు భారీగా పేరుకుపోయి ఉన్నాయి. అందువల్ల వీటన్నింటినీ సీనియర్ మంత్రులకు బదిలీ చేయడంపై శశికళ సమాలోచనలు జరుపుతున్నగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ చెన్నై పర్యటన వాయిదా పడింది. ఆయన మరో రెండుమూడు రోజుల తర్వాత వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మోడీ శనివారమే చెన్నై రానుండగా, చివరి నిముషంలో పర్యటన వాయిదా పడిందని సమాచారం.












Click it and Unblock the Notifications