'అసెంబ్లీకి బాలకృష్ణ: జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ప్రచారం'
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున హీరోలు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణలు ప్రచారం చేయనున్నారట. ఈ విషయాన్ని నందమూరి హీరో తారకరత్న చెప్పారు. 2014 సార్వత్రిక ఎననికల్లో టిడిపికి మద్దతుగా ప్రచారంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆస్తులు ఏవీ సంపాదించలేదని, కోట్లాది ప్రజల ఆదరణను ఆయన కూడగట్టుకున్నారని చెప్పారు.
సీమాంధ్ర, తెలంగాణ... రెండు ప్రాంతాల్లోను తెలుగుదేశం పార్టీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది, టిడిపిదే అన్నారు. అసెంబ్లీ, లోకసభ, జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందన్నారు.
బాలకృష్ణపై...
తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ రానున్న ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయం పార్టీ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని తెలిపారు. కాగా, బాలయ్య అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే.