ఉగాదినాడే జగన్కు నెహ్రూ షాక్: 3గురితో కలిసి టిడిపిలోకి..?
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికే ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ షాక్ ఇవ్వడానికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో ముగ్గురితో కలిసి ఆయన ఉగాది పర్వదినం రోజు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎనిమిది మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులు టిడిపిలో చేరారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నేత, తూర్పు గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఆయన స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులు టిడిపిలో చేరడానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. వీరిలో నెహ్రూతో పాటు నలుగురు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారని అంటున్నారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి అంశం జ్యోతుల నెహ్రూలో తీవ్ర అసంతృప్తికి దారి తీసిన సంగతి తెలిసిందే.
సీనియర్ ఎమ్మెల్యేగా ఈ పదవిని ఆశించినప్పటికీ, ఇతర సీనియర్లూ మద్దతు పలికినప్పటికీ, దాన్న్ి జగన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ రెడ్డికి అప్పగించారు. ఈ నిర్ణయంతో జ్యోతుల తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి ప్రముఖులు జ్యోతుల నెహ్రూను సంప్రదించి తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది.
జ్యోతల నెహ్రూతో పాటు మరో ముగ్గురు వైసిపి శాసనసభ్యులను టిడిపి యువనత నారా లోకేష్ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అసంతృప్తికి గురైన నెహ్రూను బుజ్జగించడానికి తన పార్టీ నాయకులు అంబటి రాంబాబు మరికొందరిని నెహ్రు వద్దకు జగన్ దూతగా పంపించారు. ఆ సందర్భంగా స్వయంగా నాయకుడే పిలిచి నువ్వు పిఏసీ చైర్మన్ పదవికి పనికిరావని చెప్తే తనను ఏం మాట్లాడమంటారని నెహ్రూ నిలదీసినట్లు తెలుస్తోంది.
తనను అవమానించారని, తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని, తమ వాళ్లతో మాట్లాడుకోవలసి ఉందని దూతల వద్ద జ్యోతుల తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని కూడా నెహ్రూ మీడియాతో చెప్పారు. దీన్ని బట్టి నెహ్రు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.
తూర్పు గోదావరి జిల్లాలోని తన సన్నిహిత ఎమ్మెల్యేలతో ఆయన కొద్దిరోజుల క్రితం ఆయన సమావేశం నిర్వహించారు. అంతా కలసి తెలుగుదేశం పార్టీలోకి వెళదామని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. జ్యోతులకు సమీప బంధువయిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, రంపజోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరితో కలసి టిడిపిలో చేరాలని తీర్మానించుకున్నారు.
అలాగే కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘరామిరెడ్డి కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వీరి చేరికకు సంబంధించి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నుంచి గ్రీన్సిగ్నల్ కూడా వచ్చినట్లు సమాచారం. వీరంతా ఉగాది రోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహుర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం.