దటీజ్ అబ్దుల్ కలాం: పేపర్ బాయ్ టు రాష్ట్రపతి వరకు
న్యూఢిల్లీ: కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి.
అబ్దుల్ కలాం పిల్లలను బాగా ప్రేమించేవారు. చివరి నిమిషం వరకు పిల్లలతోనే గడిపారు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థుల కోసం లివబుల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై సెమినార్లో పాల్గొన్నారు. ఎప్పుడూ కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని కలాం చెప్పేవారు. పిల్లలు, యువతతో కలిసిపోతారు.
తన కెరీర్ తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పని చేసిన అబ్దుల్ కలాం.. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక 2001లో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో టెక్నాలజీ, సొసైటల్ ట్రాన్ఫ్ఫర్మేషన్ ప్రొఫెసర్గా చేరారు. 2002 నుంచి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు.

ఆ బాధ్యతల నుంచి రిలీవ్ కాగానే మళ్లీ బోధనా వృత్తిని చేపట్టారు. విద్యార్థి లోకాన్ని, యువతను తన ప్రసంగాలు, రచనల ద్వారా వెన్నుతట్టి లేపారు. ప్రాథమికస్థాయిలోనే ఉపాధ్యాయులు పిల్లల్లో సృజనాత్మకత తీసుకు రావడానికి మంచి సమయమని చెప్పేవారు.
దేశంలో విశ్వవిద్యాలయ విద్యను సమూలంగా సంస్కరించాలని కలాం సూచించారు. ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలని, ఆత్మవిశ్వాసం నింపాలని చెప్పేవారు. పిల్లలకు, యువతకే కాదు.. ఉపాధ్యాయులకూ మార్గదర్శకుడిగా నిలిచారు.
పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు

రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్గా పని చేశారు. అలా పని చేస్తూనే చదువుకున్నారు. ఆయన నిత్య విద్యార్థి. పేద కుటుంబంలో జన్మించారు. ఇండియా -2020, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకాలు రచించారు.
కలాం తండ్రి సముద్రతీరంలోని గవ్వలు, శంఖాల్నీ సేకరించి అమ్మేవారు. పడవ యజమాని. వారికి కొద్దిపాటి కొబ్బరితోట కూడా ఉండేది. మత విశ్వాసాలు, అధ్యాత్మిక అంశాలపై కలాం తండ్రి మక్కువతో ఉండేవారు. కొబ్బరి తోటకు వెళ్లి కొబ్బరి బొండాలతో ఇంటికి చేరుకోవడం ఆయన దినచర్యగా ఉండేది.
కలాం ఎప్పుడు తన తల్లి హాజీ అమ్మాల్తో కలిసే భోజనం చేసేవారు. ఆమె కలాంకు అరిటాకులో సాంబారు, అన్నం, ఘాటైన వూరగాయలు, తాజా కొబ్బరి పచ్చడి వడ్డించేది. కలాంతో కలిసి ఏడుగురు పిల్లలతో ఆ కుటుంబం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.
రామేశ్వరం మసీదు వీధిలోని సున్నం ఇటుకలతో కట్టిన విశాలమైన ఇంట్లో ప్రతిరోజు వారి కుటుంబం సభ్యుల కంటే ఎక్కువగానే అతిథులు భోజనాలు చేస్తుండేవారు. ఓ పడవలో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి యాత్రికులను తీసుకువేళ్లే పడవ నడుపుతూ కలాం తండ్రి మంచి వ్యాపారం చేస్తుండేవారు.

ఒకసారి వచ్చిన భారీ తుపాన్తో ఆ పడవ తునాతునకలు అయ్యింది. అప్పటి నుంచి కలాంకు తన సోదరి భర్త అహ్మద్ జలాలుద్దీన్తో స్నేహం కుదిరింది. కొద్దిపాటి ఇంగ్లీష్ చదువుకున్న అతనే కలాంను బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తు ఉండేవాడు. మరో బంధువు షంషుద్దీన్ కూడా కలాంను ప్రభావితం చేశారు.
షంషుద్దీన్ రామేశ్వరంలో వార్తా పత్రికల పంపిణీదారు. పాఠశాలలో చదువకునే రోజుల్లోనే కలాం అతనికి సహాయకుడిగా ఉంటూ ఇంటింటికి పత్రికలు వేస్తూ మొట్టమొదటగా వేతనాన్ని సంపాదించారు.
జలాలుద్దీన్, షంషుద్దీన్లతో గడిపిన సమయమే తన బాల్యంలో అద్వితీయతకు, తన జీవితంలో మార్పుకీ, తన సృజనాత్మకతకు కారణమని కలాం చెప్పేవారు. కలాంకు చిన్నతనంలో రామనాథశాస్త్రి, అరవిందం, శివప్రకాశన్ అనే మిత్రులుండేవారు.
వారంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారైనప్పటికీ కలాంతో అరమరికలులేని స్నేహం నెరిపేవారు. రామేశ్వరం పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ కలాంను ఎంతో అభిమానించేవారు. పలుమార్లు కలాంను తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనే స్వయంగా వడ్డించి భోజనం పెట్టేవారు.

ఆయన చెప్పే పాఠాలే కలాంకు పరిశోధనపై ఆసక్తి కలిగించాయి. కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలో పూర్తి కావడంతో ఉన్నత చదువు రామనాథపురం జిల్లా కేంద్రంలోని స్క్వారాట్జ్ పాఠశాలలో సాగింది. జైనులాబ్దీన్ తన కుమారుడిని కలెక్టరుగా చూడాలనుకునేవారు.
రామనాథపురం హైస్కూల్ ఉపాధ్యాయుడు ఇయదురై సొలొమోన్ కలాంకు ఆదర్శ పథ నిర్దేశకుడయ్యారు. ఉన్నత పాఠశాల విద్య తరువాత కలాం 1950లో తిరుచినాపల్లిలోని సెంట్ జోసెఫ్ కళాశాలలో చేరారు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ ఐఐటీలో చేరారు.
ఆ సమయంలో కలాం సోదరి జొహరా తన బంగారు గాజులు, గొలుసు కుదువపెట్టి సహాయం చేసింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కలాం ఏరోనాటికల్ ఇంజినీరింగ్ను ఎంచుకున్నారు. అక్కడ ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవీ పండలై, ప్రొఫెసర్ నరసింగరావులు కలాం ఆలోచనలను తీర్చి దిద్దారు.
భారత జాతి గర్వించతగ్గ శాస్త్రవేత్తగా కలాంను మలిచారు. ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో పట్టా అందుకున్నాక బెంగళూరులో డీఆర్డీవోలో జూనియర్ శాస్త్రవేత్తగా కలాం ఉద్యోగ జీవితాన్ని ప్రారరభించారు. ప్రభుత్వ కీలక సలహాదారుగానూ ఉన్నారు.
ఒత్తిడిలో ఉన్నా చిరునవ్వే ఆయన సమాధానం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, నిరంతర పరిశోధకుడిగా ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా తన కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శించటం ఇంతవరకు చూడలేదని ఎంతోమంది చెబుతుంటారు.
సమయపాలన పాటించకపోవడం, అప్పగించిన పని పూర్తి చేయకుంటే మాత్రం యూ ఫన్నీ ఫెలో అంటారంట.
అలా అన్నారంటే ఆయన చాలా కోపంలో ఉన్నారని అర్ధం. మారుమూల పల్లెల్లోనూ పట్టణ స్థాయి వసతులు కల్పించాలని భావించారు.

ప్రభుత్వాలను కదిలించారు. ప్రభుత్వ పథకాల్లో తన కలను భాగం చేశారు. అదే పుర మిషన్. పూర్తిపేరు.. ప్రొవైడింగ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా. దేశంలో ఆరు లక్షల గ్రామాల్లో 70 శాతం జనాభా నివసిస్తున్నారు. పట్టణ సదుపాయాలు గ్రామాల్లో ఉండాలని కోరుకునేవారు.
దేశానికి తొలి బ్రహ్మచారి రాష్ట్రపతి. తొలి శాస్త్రవేత్త రాష్ట్రపతి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి. భారతరత్న పొందిన మూడో రాష్ట్రపతి. ఇవన్నీ కలాం ప్రత్యేకతలే. ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో తన వేషభాషలు, నడవడిక, జీవనశైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు.
కలాం 2002 జులైలో 11వ నుంచి జులై 25, 2002 నుంచి జులై 25, 2007 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. రాష్ట్రపతిగా భవన్కే పరిమితమై పోకుండా దేశమంతటా పర్యటిస్తూ, చిన్నారులు, యువత, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వంటి భిన్న వర్గాలను కలుస్తూ జనంలో మమేకమయ్యేవారు.
భారత పురోగతికి, భవిష్యద్దర్శనానికి సంకేతమయ్యారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్కు ఆయన బంధువులు అతిథులుగా వచ్చి కొన్నాళ్లు గడిపి వెళ్లగా అందుకైన ఖర్చంతా ఆయన వ్యక్తిగతంగా భరించుకున్నారు.
పదవి చేపట్టాక ఒకట్రెండు సూట్కేసులతో రాష్ట్రపతి భవన్కు వచ్చిన కలాం.. మళ్లీ అంతే నిరాంబరంగా బయటికి సాగారు. 2007లో రెండోసారి పదవిని అధిష్టించేందుకు ముందుగా అసక్తి కనబరిచినా, కొన్ని పక్షాలు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు.
రాష్ట్రపతి భవన్ను రాజకీయ ప్రక్రియలో భాగం చేయడం తనకిష్టం లేదన్నారు. 2012లో సైతం రాష్ట్రపతి పదవి రేసులో కలాం పేరు వినిపించింది. ములాయం, మమత, కాంగ్రెస్ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని బిజెపి ప్రకటించగా, కొద్దిరోజులకు ములాయం వెనుకంజ వేశారు.
చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కలాం స్వయంగా ప్రకటన చేశారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు కాదని తన పదవీకాలంలో రుజువు చేశారు. లాభదాయక పదవుల బిల్లును తిరస్కరించారు. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్, భాగస్వామ్య వామపక్షాల్లో ఒకింత ఆందోళన కలిగించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
21 క్షమాభిక్ష పిటిషన్లలో 20ని అపరిష్కృతంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. తన పదవీ కాలంలో ఒకే ఒక క్షమాభిక్ష పిటిషన్పై చర్య తీసుకున్నారు. అత్యాచారం కేసులో దోషి ధనంజయ ఛటర్జీ దరఖాస్తును తోసిపుచ్చారు.
అఫ్జల్గురు క్షమాభిక్ష పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై తలెత్తిన విమర్శలకు ఆయన తర్వాత సమాధానమిస్తూ.. ప్రభుత్వం నుంచి తనకెలాంటి పత్రాలు రాలేదని చెప్పారు. 2005లో బిహార్లో రాష్ట్రపతి పాలన నిర్ణయానికి విదేశాల నుంచే సమ్మతి తెలుపడంపైనా విమర్శలు తలెత్తాయి.
త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించే రాష్ట్రపతి పదవిలో కలాం సైనికుల్లో సైతం స్ఫూర్తిని రగిల్చారు. వారిలో ఒకడిననే భావనను నింపారు. ప్రపంచంలో అత్యంత ఎత్త్తెన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్లో పర్యటించిన భారత తొలి రాష్ట్రపతిగా కలాం పేరొందారు.
కలాం కళా ప్రేమికుడు. నిత్య స్వాప్నికుడు. మహా దేశభక్తుడు. నిత్య విద్యార్థి. నిరాడంబరంగానే ఉండేవాడు. మీరు ఎవరు అని అడిగితే.. 'నేను శాస్త్రవేత్తను. ఉపాధ్యాయుడిని, విద్యార్థిని అని మొదట చెబుతారు. ఆ తర్వాతే రాష్ట్రపతిగా పని చేశానని చెబుతారు.
హైదరాబాదులో రెండు అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరే పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇందులో అతి తక్కువ రకం కరోనరీ స్టంట్ ఒకటి అయితే, మరొకటి పోలియో రోగుల కోసం తయారు చేసిన తక్కువ బరువు పరికరం.
2002 జూలై 25 నుంచి 2007 వరకు రాష్టపతిగా ఉన్నారు. కలాం 11వ రాష్ట్రపతి.
1997లో భారతరత్న అందుకున్నారు.
1981లో పద్మభూషణ్
1990లో పద్మవిభూషణ్
1998లో వీర్ సావర్కర్ పురస్కారం
భగవద్గీత, ఖురాన్, వేదాలు తన జీవితంలో అనేక సందర్భాల్లో గందరగోళాన్ని తొలగించాయని కలాం చెప్పేవారు
అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం.
తండ్రి పేరు జైనుల్ అబిదీన్. పడవ యజమాని. తల్లి హాజీ అమ్మాల్. గృహిణి.
తమిళనాడులోని రామేశ్వరంలో 1931 అక్టోబర్ 15న జన్మించారు.
తిరుచురాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందారు.
చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం కోసం 1954లో చేరారు.
డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్లో చీఫ్ సైంటింస్ట్గా 1960లో చేరారు. ఇస్రోకు 1969లో బదలీ అయ్యారు.
1992 నుంచి 1999 వరకు ప్రధానికి ముఖ్య శాస్త్రీయ సలహాదారుగా, డిఆర్డీవో కార్యదర్శిగా ఉన్నారు.
2002 నుంచి 2007 వరకు 11వ రాష్ట్రపతిగా ఉన్నారు.
ఎప్పుడూ విద్యార్థులతో గడిపేందుకు ఇష్టపడేవారు. ఎక్కడకు వెళ్లినా విద్యాసంస్థల్లో కార్యక్రమం ఉండేది.
కాగా, అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications