ప్రకాశం పగలు: గొట్టిపాటి వర్సెస్ కరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి, మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కరణం బలరామక్రుష్ణమూర్తి, గొట్టిపాటి హనుమంతరావు కుటుంబాల మధ్య వ్యక్తిగత కక్ష్యలకు పెట్టింది పేరు.

అమరావతి/ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా అద్దంకి, మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గాలు కరణం బలరామక్రుష్ణమూర్తి, గొట్టిపాటి హనుమంతరావు కుటుంబాల మధ్య వ్యక్తిగత కక్ష్యలకు పెట్టింది పేరు. 1978లో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడుతోపాటు ఎమ్మెల్యేగా కరణం బలరాం ఉన్నా.. ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి హన్మంతరావుతో ఘర్షణకు కారణం రాజకీయాలే. గతంలోను ఒకే పార్టీలో ఉన్న ఈ వర్గాలు, తమ వర్గపోరాటాన్ని అలా కొనసాగించుకోవడానికి కారణం ఏమిటి? ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు మధ్య వర్గపోరాటం ఫ్యాక్షన్ స్థాయికి చేరడానికి కారణం రాజకీయాలే. కరణం బలరాం చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయ అరంగేట్రం చేశారు. 1978లో కాంగ్రెస్ తరుపున అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కానీ 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున మార్టూరు నుంచి గొట్టిపాటి హన్మంతరావు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో చంద్రబాబుతో పాటు కరణం బలరాం టీడీపీలో చేరారు. 1985లో జరిగిన ఎన్నికల్లో బలరాంకు టీడీపీ తరుపున మార్టూరు టికెట్ కేటాయించారు. టీడీపీ తరుపున గొట్టిపాటి హనుమంతరావు జడ్పీ చెర్మన్‌గా ఉండేవారు. కరణం బలరాంను టీడీపీలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన గొట్టిపాటి పార్టీ టికెట్ కూడా కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

1989లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి పోటీ

1989లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి పోటీ

1985 ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు గొట్టిపాటి హన్మంతరావు మద్దతు ప్రకటించారు. బలరాంకు టీడీపీ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గొట్టిపాటి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడమే రక్తచరిత్రకు బీజం పడేలా చేసింది. రెండు కుటుంబాలు పరస్పరం దాడులు, కిడ్నాపులు, బాంబు దాడులకు దిగాయంటే అతిశేయోక్తి కాదు. నాటి నుంచి మార్టూరు, అద్దంకి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో వర్గాలు తయారయ్యాయి. ఇద్దరు నేతల అనుచరులు ఆయా గ్రామాల్లో బలోపేతం కావడంతో తరచూ ఘర్షణలు జరిగేవి. ఇవి ఒక్కోసారి దాడుల వరకు వెళ్లేవి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కరణం టీడీపీ తరపున హనుమంతరావు కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బలరాం విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్ధితి విషమించింది. 1989లో హన్మంతరావు అనుచరుడు రంగనాయకులు మిస్సింగ్ కేసు నమోదైంది కానీ ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు.

వెంకట సుబ్బయ్య హత్య కేసులో ఇలా

వెంకట సుబ్బయ్య హత్య కేసులో ఇలా

ప్రకాశం జిల్లాలో ఫ్యాక్షన్ రక్త చరిత్రను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘటన 1992లో చోటుచేసుకున్నది. గొట్టిపాటి హనుమంతరావు తనయుడు కిషోర్ సహా నలుగురిని దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం రేపింది. మ్రుతదేహాలు బలరాం ఫామ్ హౌస్‌లో లభించడంతో ఈ హత్యకు కారణం అంటూ కరణం బలరాంతో పాటు అతని అనుచరులపై కేసులు నమోదయ్యాయి. 1993లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి హత్య కేసులో బలరాంకు కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పుపై కరణం హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. 1994లో కింది కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తర్వాత కరణం కాంగ్రెస్‌లో చేరారు. అప్పటివరకు వర్గాల మధ్య ఉన్న ఘర్షణలు గొట్టిపాటి కిషోర్ హత్యతో నేతల మధ్యకు తారాస్థాయికి చేరాయి. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం పోటీ చేశారు. హనుమంతరావు టీడీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1997లో హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. అదే ఏడాది బలరాం టీడీపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి నరసయ్యకు బలరాం మద్దతు ప్రకటించారు.

2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున గొట్టిపాటి రవికుమార్ గెలుపు

2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున గొట్టిపాటి రవికుమార్ గెలుపు

హన్మంతరావు హఠాన్మరణం తర్వాత మార్టూరు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గొట్టిపాటి నరసయ్య లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచారు. అంతటితో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ముగిసిపోయినట్లేనని అందరూ భావించారు. గొట్టిపాటి వర్గీయులకు మార్టూరు, కరణంకు అద్దంకి బాధ్యతలు అప్పగించేలా రాజీ చేసుకున్నారు. కాంగ్రెస్ రాజకీయం మళ్లీ రక్త చరిత్రను రగిలించేలా చేసింది. 2004 ఎన్నికల్లో మార్టూరు నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య బంధువు, హన్మంతరావు తమ్ముడి కొడుకు గొట్టిపాటి రవికుమార్‌ను కాంగ్రెస్ తరుపున పోటీకి నిలబెట్టారు వైయస్ రాజశేఖర్‌రెడ్డి మార్టూరు నుంచి రవి, అద్దంకి నుంచి కరణం గెలుపొందడంతో ఆగిపోయిందనుకున్న రక్త చరిత్రకు మళ్లీ బీజం పడినట్లయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన చేసిన రాజకీయం కూడా ఈ ఫ్యాక్షన్ గొడవలు పెరిగిపోవడానికి కారణమైంది. మార్టూరు నియోజకవర్గాన్ని తీసేసి అద్దంకిలో కొంత భాగం, పర్చూరులో కొంత భాగం కలిపేయడంతో గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి తన అదృష్టాన్ని పరిక్షించుకోవాల్సి వచ్చింది. 2009లో కరణం బలరాం, 2014 ఎన్నికల్లో కరణం కొడుకు వెంకటేశ్‌పై గొట్టిపాటి రవి కుమార్ గెలిచారు.

టీడీపీ తురుపు ముక్కగా గొట్టిపాటి

టీడీపీ తురుపు ముక్కగా గొట్టిపాటి

1999 వరకు ప్రకాశం జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న కరణం బలరాం క్రమంగా పట్టు కోల్పోతున్నారని తేలిపోయింది. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి మార్టూరులో, 2009లో అద్దంకి నుంచి కరణం బలరాంపై, 2014లో బలరాం తనయుడు వెంకటేశ్ పై గొట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. దీంతో కరణం బలరాం అసంత్రుప్తి వ్యక్తం చేసినా పట్టించుకోకుండా గొట్టిపాటి రవి కుమార్‌ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు. అధికార పార్టీలో ఉన్నామన్న భరోసాతో కరణం బలరాంపై ఆధిపత్యానికి గొట్టిపాటి రవికుమార్ తెర తీశారు. తాజాగా బల్లి కురవ మండలం వేమవరంలో జరిగిన ఘటనతో ఇరు కుటుంబాల మధ్య గల వ్యక్తిగత వైరం మరోసారి పెచ్చరిల్లింది. కానీ తనకీ హత్యారాజకీయాలతోనే సంబంధం లేదని రవికుమార్ తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో తన కుటుంబం చాలా నష్టపోయిందని, తనకు సంబంధం ఉన్నదని రుజువు చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ చేశారు. కానీ ఈ హత్యలు చేసింది మాత్రం రవి కుమార్ అనుచరులేనని పరిణామాలు చెప్తున్నాయి. ఈ ఘటనతో చంద్రబాబునే కరణం సవాల్ చేయడంతో భవిష్యత్ అద్దంకి ప్లస్ మార్టూరు నియోజకవర్గ రాజకీయాలు మారిపోనున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+