కేంద్ర మంత్రులతో బాబు ఒత్తిడి: కెసిఆర్ చిరాకు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రుల ద్వారా ఒత్తిడి తీసుకుని వచ్చి తనను చిరాకు పెడుతున్నారంటూ ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర మంత్రులతోనే కాకుండా కేంద్ర కార్యదర్శులతో కూడా తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి పెడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేశాయి. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కూడా పాలు పంచుకుంటోంది. ఆ సాన్నిహిత్యాన్ని తనపై ఒత్తిడి తేవడానికి చంద్రబాబు వాడుకుంటున్నారనేది కెసిఆర్ అభియోగం.

చంద్రబాబు కేంద్ర మంత్రులతో, కార్యదర్శులతో మాట్లాడుతారని, తమ ప్రభుత్వానికి సూచనలు చేయిస్తారని, రెండు వార్తాపత్రికల్లో కథనాలు రాయిస్తారని, ప్రతి విషయంపై తనను విమర్శించడానికి ప్రయత్నిస్తారని కెసిఆర్ అంటున్నారు. తనకు దూరదృష్టి లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం పంటలను రక్షించడానికి అక్టోబర్ నెలలో 400 కోట్ల రూపాయల విలువ చేసే విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేసిందని ఆయన అంటున్నారు. ఒక్క నెలలో దేశంలోని ఏ ప్రభుత్వం కూడా అంత విలువ చేసే విద్యుచ్ఛక్తిని కొనుగోలు చేయలేదని ఆయన వాదిస్తున్నారు.
మరోసారి ముఖాముఖి
వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోవడానికి గవర్నర్ నరసింహన్ సమక్షంలో చంద్రబాబుతో ముఖాముఖి సమావేశానికి కెసిఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో ముఖాముఖి సమావేశానికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అని గవర్నర్ తెలంగాణ ముఖ్యమంత్రిని ఇటీవల అడిగినట్లు చెబుతున్నారు. తనకు అటువంటి అభ్యంతరాలు ఏవీ లేవని కెసిఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
గత సమావేశంలో అంగీకారం కుదిరిన అంశాలను చంద్రబాబు అమలు చేయడం లేదని కెసిఆర్ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తన రాష్ట్రాభివృద్ధిపైనే తనకు దృష్టి గానీ చంద్రబాబు మాదిరిగా వేరే రాష్ట్రం వ్యవహారాల్లో తాను తలదూర్చబోనని ఆయన స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యవహారాల్లో చంద్రబాబు తలదూరుస్తూ తనను చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నిస్తున్నారని కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications