డిసెంబర్లో కిరణ్ పార్టీ: వెంట ఎవరెవరు?
హైదరాబాద్: రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి డిసెంబర్ నెలలో పార్టీ పెట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం, కాంగ్రెసు అధిష్టానం ముందుకు పోతే కొత్త పార్టీ పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆయన డిసెంబర్ వరకు వేచి చూడాలని అనుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్రం ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆ బిల్లు ఆమోదం పొంది, రెండు రాష్ట్రాలు ఏర్పడితే కచ్చితంగా పార్టీ పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన ఈ ఎన్నికల్లోగా జరదని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తున్నారు. ఇంత త్వరగా ప్రక్రియ పూర్తి కాదని, వీలైతే అడ్డంకులు కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ తీర్మానాన్ని శానససభలో ఓడించి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిస్పందనను చూసిన తర్వాత పార్టీ పెట్టే విషయంపై ఆలోచన చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు, మంత్రులు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లోకి వలసలు వెళ్లకుండా కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆపుతున్నట్లు చెబుతున్నారు. పార్టీ పెట్టే ఆలోచనతోనే వారు ఈ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. తాను కొత్త పార్టీ పెడితే ఎపిఎన్జీవోల మద్దతు తమకు సంపూర్ణంగా లభిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు. ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుతో కిరణ్ కుమార్ రెడ్డికి ఈ మేరకు అవగాహన ఉన్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.
ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించినా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ చల్లారకుండా చూడాలనే వ్యూహంతో కిరణ్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడిస్తే కచ్చితంగా విభజన ప్రక్రియ ఆగిపోతుందని, తీర్మానాన్ని ఓడించి రాష్ట్రపతిని కలిసి విభజనను అడ్డుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డికి సీమాంధ్రకు చెందిన మంత్రులు శైలజానాథ్ (అనంతపురం), ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ (కర్నూలు), కె. పార్థసారథి (కృష్ణా), పితాని సత్యనారాయణ (పశ్చిమ గోదావరి), గంటా శ్రీనివాసరావు (విశాఖ), కాసు వెంకట కృష్ణా రెడ్డి (గుంటూరు), తోట నర్సింహం (తూర్పు గోదావరి) కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉంటారని వార్తలు వచ్చాయి.
సీనియర్ శాసనసభ్యుల్లో జెసి దివాకర్ రెడ్డి (అనంతపురం), గాదె వెంకటరెడ్డి (గుంటూరు), రాయపాటి సాంబశివ రావు (గుంటూరు), ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉండడం వల్లనే కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వెళ్లే విషయంలో జాప్యం చేస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 40 మంది శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల తర్వాత విభజనకు కారణమైన కాంగ్రెసు వెంట వెళ్తారని ప్రచారం చేయడం ద్వారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని చెప్పడం ద్వారా సమైక్యాంధ్ర కోసం నిలబడిన నేతగా కొత్త పార్టీతో ముందుకు వస్తే తనను సీమాంధ్ర ప్రజలు ఆదరిస్తారని కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకంతో ఉన్నట్లు చెబుతున్నారు.