జగన్ నో: సైకిల్వైపే అందరి చూపు, బాబుతో భేటీలు
సోమవారం పలువురు నేతలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు వైయస్ జగన్ నో చెప్పడంతో ఆయన టిడిపి అధ్యక్షుల అపాయింటుమెంట్ కోరారు. నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, తిరువూరి ఎమ్మెల్యే పద్మజ్యోతిలు సోమవారం బాబును కలిశారు. వీరిద్దరూ టిడిపిలో చేరుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాను టిడిపిలో చేరుతున్నానని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యులు శ్రీధర కృష్ణారెడ్డి చెప్పారు.
తాను టిడిపిలో చేరుతాననేది వదంతి కాదని, నిజమేనని, ఫిబ్రవరి మొదటి వారంలో తాను ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. టిడిపి సీనియర్ ఎమ్మెల్యే ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శిల్పామోహన్ రెడ్డి, పార్థసారథి రెడ్డి తమ పార్టీలోకి వస్తారని, గంగుల ప్రతాప రెడ్డి చేరే అవకాశమూ ఉందని, ముఖ్యమంత్రి పార్టీ పెడితే మాత్రం అందులో చేరడంపై ఆలోచిస్తారన్నారు. 23వ తేదీ తర్వాత వారు తమ పార్టీలోకి వస్తారన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన నీరజా రెడ్డి కూడా టిడిపిలోకి వస్తామంటున్నారని, స్థానికంగా ఉన్న తమ కేడర్ ఆమె రాకను ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. టిడిపిలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న మంత్రి గంటా శ్రీనివాస రావుతో మంత్రులు టిజి, ఏరాసు, కాసు వెంకట కృష్ణారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లోని గంటా చాంబర్లో వీరు భేటీ అయ్యారు. వలసలపై ఊహాగానాలు జోరందుకోవడంతో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కిరణ్ కొత్తపార్టీ పెడతారా? పెడితే ఎలా ఉంటుంది? ఇతర పార్టీల్లోకి వెళితే ఎలా ఉంటుంది? అనే అంశాలపై వీరిలో కొందరు నేతలు ఆరా తీస్తున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా పార్టీ అధికారంలోకి రాలేదని, ఇప్పటికిప్పుడు విభజన ప్రక్రియ ఆగినప్పటికీ, కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదని, టిడిపి, జగన్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని, తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలున్నాయని, పరిస్థితి బాగున్న పార్టీలోకి వెళ్లే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారని, తప్పనిసరిగా జంప్ కావటమే ఉంటుందని, ఈ నెలాఖరు వరకు స్పష్టత వస్తుందని, కిరణ్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎత్తుకోవటం వల్ల ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరిగిందని, సిఎం పార్టీ పెడితే ఎలా ఉంటుందో చెప్పలేమని, వ్యక్తిగత ఇమేజ్ వేరు పార్టీ పెట్టడం వేరని, తెలంగాణ వాదంతో పార్టీ పెట్టిన కెసిఆర్ కూడా స్వీప్ చేయలేదు కదా అని ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు.
తాను టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధమని, గుంటూరు లోకసభ అభ్యర్థిగా గల్లా జయదేవ్ ఆ పార్టీకి గల్లా జయదేవ్ ఖరారయ్యారని, తన సోదరుడికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తారనే విషయం తనకు తెలియదని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు అన్నారు. విభజన జరిగేంత వరకూ తాను కాంగ్రెస్లోనే ఉంటానని, ఈ విషయంలో తనకు స్పష్టత ఉందని, ఎక్కడకు వెళ్లినా ద్వారాలు తెరిచే ఉంటాయని, కిరణ్ పార్టీ పెడతారో లేదో తెలియదని, తమతో ఆ విషయం చెప్పడం లేదని టిజి అన్నారు.
తాను పార్టీలో ఉంటానంటే మీరు వెళ్లమంటున్నారని, ఏదో ఒక విషయం చెబితే టిడిపిలోకా లేక జగన్ వైపు వెళ్లాలో తేలుతుందని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి పిసిసి చీఫ్ బొత్సతో అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి పార్టీ పెడితే అందులో చేరుతానని లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలోకి వెళ్లనని శత్రుచర్ల చెప్పారు. ఆ తర్వాత పార్టీ మారనని, అవసరమైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని కూడా చెప్పారు.
కాగా, తన పైన శత్రుచర్ల చేసిన వ్యాఖ్యలను ధర్మాన ప్రసాద రావు ఖండించారు. మరోవైపు కిరణ్ కొత్త పార్టీపై తేల్చక పోవడంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సీట్లు ఆశించే వారి చేరికలకు నో చెబుతున్నందువల్లే తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారనే వారు లేకపోలేదు.