రియల్ హీరో ఈ రైతు:చెన్నైవరద బాధితులకు సాయం
చెన్నై: ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షాలు, వరదలు ముంచివేసినప్పుడు వివిధ కంపెనీలు, కార్పోరేట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయాన్ని అందించారు.
ఎవరికి తోచిన సాయం వారు చేశారు. ధన, వస్తు రూపంలో చాలామంది సాయం చేశారు. సిద్ధార్థ్ వంటి నటులు నేరుగా రంగంలోకి దిగి బాధితులకు సాయం అందించారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ తమవంతు సహకారం అందించారు.
అయితే, ఓ సాధారణ రైతు మాత్రం కష్టాల్లో ఉండి కూడా సాయం చేయడం గమనార్హం. లక్ష్మణ్ రుక్మాణే అనే రైతు కర్నాటక బెల్గాం జిల్లాలోని కడోలి గ్రామానికి చెందిన వాడు. అతనికి మూడు ఎకరాల వ్యవసాయం ఉంది. ఇటీవల పంటలు సరిగా పండక అతని నష్టాల్లో కూరుకుపోయాడు.

అంతేకాదు, రూ.25వేల అప్పు కూడా ఉంది. అయితే, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ... ఈ సమస్యలు అతనిని చెన్నై బాధితులకు సాయం చేయకుండా ఆపలేకపోయాయి. ఇతని వయస్సు 73. లక్ష్మణ్ ఇటీవల డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి చెన్నై వరద బాధితులకు రూ.5,000 ఇచ్చారు.
లక్ష్మణ్ భార్య అయిదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి పిల్లలు లేరు. అతను ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తనకు కొన్ని అవసరాలు ఉంటాయని, వాటి వరకు డబ్బులు చాలునని, జీవితంలో తాను ఎక్కువ ఆశించడం లేదని, కాబట్టి తనకు ఉన్న దాంట్లో అవసరమైన వారికి సాయం చేయడం సంతృప్తిగా ఉంటుందని చెప్పారు.
చెన్నై వరద బాధితులకు రూ.5000 ఇవ్వడమే కాదు... కడోలి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీలో టాప్ ర్యాంక్ సాధించే విద్యార్థికి ఆయన ప్రతి ఏడాది రూ.1,500 క్యాష్ ప్రైజ్ ఇస్తుంటారు.
విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించడం కోసం అలా చేస్తుంటారు. పాఠశాల భవంతి ప్రహారీ గోడ కోసం అతను రూ.78,000 ఇచ్చారు. కొద్ది నెలల క్రితం నేపాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. నేపాల్ భూకంప బాధితులకు రూ.5000వేలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications