చిక్కుల్లో షబ్బీర్ అలీ: 1.5కోట్ల లంచం కేసులో ఈడీ ఛార్జీషీటు
న్యూఢిల్లీ/హైదరాబాద్: మరో తెలంగాణ కాంగ్రెస్ నేత చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే గంజాయి కుట్ర కేసులో మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణ శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ ఈడీ కేసులో ఇరుక్కున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఛార్జీషీటులో షబ్బీర్ పేరు
సీబీఐ మాజీ డైరెక్టర్లు ఏపీసింగ్, రంజిత్ సిన్హాలకు హవాలా మార్గంలో నిధులందించిన ప్రధాన నిందితుడు మొయిన్ ఖురేషీతో పాటు ఈడీ చార్జిషీటులో షబ్బీర్ అలీ పేరుందని పేర్కొన్నాయి. ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. యూపీఏ ప్రభుత్వ హయాంలో సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న పలువురు నిందితులు కేసుల నుంచి బయట పడేందుకు సీబీఐ డైరెక్టర్లకు ముడుపులు ఇచ్చుకున్నారు. ఇందుకోసం మొయిన్ ఖురేషీ సేవలను వినియోగించుకున్నారు. మాంసం ఎగుమతిదారైన మొయిన్ ఖురేషీ ఢిల్లీ హవాలా ఆపరేటర్ల సాయంతో ముడుపుల సొమ్మును సీబీఐ అధికారులకు చేరవేశాడు.
కోట్లలో నష్టం.. రంగంలోకి షబ్బీర్..
కాగా, బ్లాక్బెర్రీ ఫోన్ల ద్వారా వీరి మధ్య జరిగిన ఎస్ఎంఎస్ సంభాషణల వివరాలు దర్యాప్తు సంస్థలు సంపాదించాయి. వాటి ఆధారంగానే చార్జిషీటు నమోదు చేశారు. హైదరాబాద్కు చెందిన ఎంబీఎస్ జ్యువెల్రీస్.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎంటీఎస్కు రూ.200 కోట్ల నష్టం కలిగించిన కేసులో సుఖేశ్ గుప్తా అనే వ్యక్తిని సీబీఐ గతంలో అరెస్టు చేసింది. సీబీఐ కేసు నుంచి ఆయన్ను రక్షించేందుకు షబ్బీర్ అలీ రంగంలో దిగారనే ఆరోపణలున్నాయి.
లంచంగా 1.5కోట్లు...
సతీశ్ సనా అనే వ్యాపారితో కలిసి షబ్బీర్ అలీ 1.5 కోట్లను ఢిల్లీకి తీసుకెళ్లి మొయిన్ ఖురేషీకి అందించారని ఈడీ సోమవారం దాఖలు చేసిన ఛార్జిషీటులో పేర్కొన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వెల్లడించాయి.
ఖండించిన షబ్బీర్.. ఈడీ నోటీసు వస్తే..
కాగా, తనపై వచ్చిన ఈ ఆరోపణలను షబ్బీర్ అలీ ఖండించారు. తనకు ఈడీ నుంచి గానీ, సీబీఐ నుంచి గానీ ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. కాబట్టి ఛార్జిషీటులో తనపేరు ఉండే అవకాశం లేదని చెప్పారు. ఈడీ పిలిస్తే తప్పకుండా వెళతానని, దర్యాప్తులో సహకరిస్తానని తెలిపారు. ఒక వేళ ఈడీ నుంచి నోటీసు వస్తే మీడియాకు కూడా ఓ కాపీ ఇస్తానని చెప్పారు. తనకు ఖురేషీ ఎవరో తెలియదని, సుఖేశ్ గుప్తా మాత్రం తమ కుటుంబ స్నేహితుడని షబ్బీర్ అలీ తెలిపారు.