కాపు ఉద్యమాల నేత: ఎవరీ ముద్రగడ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమాలంటే ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. అవినీతి రహితుడిగా, నిష్కళంకుడుగా పేరు తెచ్చుకున్న ఆయనకు కాపు సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ముద్రగడ పద్మనాభం జనతా పార్టీ సానుభూతి పరుడిగా 1970 దశకంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
ముద్రగడ పద్మనాభం తండ్రి వీర రాఘవరావు జనతా పార్టీలో పనిచేసేవారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం 1983 తెలుగుదేశం పార్టీలో చేరి, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో చేరారు. నాదెండ్ల భాస్కర రావు చేతిలో ఎన్టీ రామారావు అధికారం కోల్పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాంపు రాజకీయాలను నడిపింది.
ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం ఒక్కరు మాత్రమే క్యాంప్నకు దూరంగా ఉన్నారు. అయితే, ఎన్టీ రామారావుకు ఓటేసి ఆయన విశ్వాసాన్ని పొందారు. ఎన్టీ రామారావు జీవించి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైన నాయకుడిగా ఆయన చెలామణి అయ్యారు.

ప్రజల పక్షాన నిలబడే నేతగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. 1988లో ఆయన టిడిపి రాజీనామా చేసి 1989లో కాంగ్రెసు పార్టీలో చేరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం 1989లోనూ 19994లోనూ ఆందోళనలు చేపట్టారు. అయితే, 1994 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1999లో టిడిపిలో చేరారు.
ఆయన 1999లో టిడిపి తరఫున కాకినాడ నుంచి పోటీ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2004లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరి, 2009 ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్ కూడా కోల్పోయారు.
మధ్యలో ఓసారి తన ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగి ఆ తర్వాత విరమించారు. రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు కూడా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత రెండు, మూడు నెలలుగా తుని కాపు ఐక్యగర్జనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దాంతో ఆయన తిరిగి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన ద్వారా రాజకీయాల ప్రధాన ఎజెండాలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications