ముంబై కుర్రాడు: 116 ఏళ్లనాటి రికార్డు బద్దలు
ముంబై : ప్రపంచ క్రికెట్ చరిత్రలో 15 ఏళ్ల ముంబై కుర్రాడు సరికొత్త రికార్డు సృష్టించాడు. ముంబై స్కూల్ క్రికెటర్ ప్రణవ్ ధన్వాడే 199 బంతుల్లో 652 పరుగులు చేశాడు. 78 ఫోర్లు, 30 సిక్స్లతో చెలరేగిపోయాడు. ఒక్క రోజులోనే అతను అన్ని పరుగులు మూటగట్టుకున్నాడు. 116 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును తిరగరాశాడు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్టీ భండారీ కప్ ఇంటర్ - స్కూల్ క్రికెట్ టౌర్నమెంట్లో ప్రణవ్ పరుగుల సునామీ సృష్టించడమే కాకుండా నాటౌట్గా మిగిలాడు. ధనవాడే కల్యాణ్లోని శ్రీమతి కెసి గాంధీ స్కూల్ తరఫున ఆడాడు.
అతని పరుగుల సునామీ కారణంగా కల్యాణ్కు చెందిన ఆర్య గురుకుల్ స్కూల్ జట్టుపై కెసి గాంధీ స్కూల్ ఒక్క వికెట్ నష్టానికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 956 పరుగులు చేసింది. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన సిద్దేష్ పాటిల్ వంద పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఆకాశ్ సింగ్ 173 పరుగులు చేసి అవుటయ్యాడు.
1899లో ఆర్థూర్ కోలిన్స్ అనే క్రికెటర్ ఇంగ్లండ్లో జరిగిన జూనియర్ హౌస్ మ్యాచ్లో 628 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 1901లో ఆస్ట్రేలియ క్రికెటర్ చార్లెస్ ఈడీ 566 పరుగులు చేశాడు. ముంబై పిన్న వయస్సులో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లకు పెట్టింది పేరుగా నిలిచింది. సర్పరాజ్ ఖాన్ 2009లో 439 పరుగులు చేయగా, 2010లో అర్మాన్ జాఫర్ 498 పరుగులు చేశాడు.
తండ్రి ఆటో డ్రైవర్
అద్భుతమైన ప్రదర్శన చేసిన ప్రణవ్ తండ్రి ఓ ఆటో డ్రైవర్. ప్రణవ్ ఆడుతున్నప్పుడు తండ్రి ప్రశాంత్ మైదానికి వచ్చాడు. ఆ సమయంలో ప్రణవ్ 300 పరుగుల మైలు రాయి దాటాడు. తన కుమారుడి మిత్రుడి తండ్రి ఒకరు ఫోన్ చేసి మీరు ఆట చూడడానికి వెళ్లలేదా అని అడిగారని, వెంటనే తాను మైదానికి పరుగులు తీశానని ప్రశాంత్ చెప్పారు. తన పదకొండేళ్ల కఠిన శ్రమకు ఫలితం దక్కిందని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.
కళ్యాణ్ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో తాను తన కుమారుడిని బాంద్రాలోని ఎంఐజిలో చేర్చానని చెప్పారు. తాను ఉదయం పూట ఆటోలో మైదానంలో దింపి సాయంత్రం ఇంటికి తీసుకుని వస్తుండేవాడినని, అయితే 2014 నుంచి ఆ పని మానేశానని, ప్రణవ్ సొంతంగా రావడం పోవడం అలవాటు చేసుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి ఇతర పిల్లలతో కలిసి వెళ్తున్నాడని చెప్పారు.
రికార్డు సృష్టించినందుకు తనకు ఆనందంగా ఉందని ప్రణవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పాడు. వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన తర్వాతనే తాను రికార్డు గురించి ఆలోచించినట్లు తెలిపాడు.