అమెరికాలో సిఎంల తనయులు: ఎవరిది పైచేయి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాటల యుద్ధంలో మునిగిపోయారు. చంద్రబాబును కెసిఆర్ కిరికిరి బాబుగా అభివర్ణిస్తూ, ఆయనకు తెలంగాణలో ఏం పని అని కెసిఆర్ ప్రశ్సిస్తే, టిడిపి లేకుంటె కెసిఆర్ గొర్రెలను కాసుకునేవాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, కెసిఆర్ ఇక్కడ మాటల యుద్ధంలో మునిగిపోగా, వారి కుమారులు అమెరికాలో పోరుకు సిద్ధమవుతున్నారు. టిడిపిలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చేయి పెడుతున్నారు. ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడానికి ఆయన అమెరికాలో కృషి చేస్తారు.
ఇదే సమయంలో కెసిఆర్ కుమారుడు, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అకస్మాత్తుగా అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. నారా లోకేష్ అమెరికాలో ఉన్న కాలంలోనే కెటి రామారావు అమెరికాలో ఉంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడులను రాబట్టడంతో ముఖ్యమంత్రుల కుమారుల్లో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తిగా మారింది.
నారా లోకేష్ అమెరికాలో చదువుకుని వచ్చి, తండ్రికి సాయంగా తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషిస్తుంటే, అమెరికాలోని ఉద్యోగాన్ని వదిలేసి, తెలంగాణ ఉద్యమ కాలంలో తిరిగి వచ్చిన కెటిఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కీలక భూమిక పోషిస్తున్నారు.
కాగా, ఏపీలో రూ.1500 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నట్లు టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ చెప్పారు. స్మార్ట్ విలేజ్ పథకం కింద 250 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్ఆర్ఐలు సిద్ధంగా ఉన్నారన్నారు.
నిమ్మకూరు, కొమరవోలు గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనులను ఎన్ఆర్ఐలకు వివరిస్తానని ఆయన తెలిపారు. ఒబామాతోపాటు వివిధ రాష్ర్టాల గవర్నర్లను కూడా కలుస్తామని ఆయన చెప్పారు.