సర్వే: తెలంగాణ కెసిఆర్ వైపే, బాబు దారుణం
న్యూఢిల్లీ: తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వైపు ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. ఎన్డీటివీ ఓపినీయన్ పోల్లో ఈ విషయం తేలింది. నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలంగాణలో దారుణంగా ఉన్నట్లు తేలింది. తెలంగాణలో తెరాస అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలింది.
ఎన్డీటీవీ తరఫున హన్సా రీసెర్చ్ గ్రూప్ తాజాగా దేశవ్యాప్తంగా ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోనూ ప్రజల అభిప్రాయాలు సేకరించి పార్టీల భవితవ్యాన్ని అంచనా వేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సీట్లలో తెరాసకు 11, కాంగ్రెస్కు 5 సీట్లు వస్తాయని తేలింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే సంస్థ చెప్పింది.
తెలంగాణలో తెరాస 33శాతం, కాంగ్రెస్ 27శాతం ఓట్లను పొందే అవకాశం ఉంది. బిజెపికి 15 శాతం, తెలుగుదేశం పార్టీకి 8 శాతం ఓట్లు దక్కే అవకాశముంది.
ఈ సర్వే ప్రకారం సీమాంధ్రలో జగన్ పార్టీ వైసీపీకే అత్యధికంగా 15 సీట్లు వస్తాయి. బీజేపీ పొత్తుతో టీడీపీ 9 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలుస్తుంది.
అధికార కాంగ్రెస్ ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంటుందని అంచనా. సీమాంధ్రలో వైసీపీకి 43శాతం, టీడీపీ+బీజేపీ కూటమికి 37శాతం ఓట్లు పోలయ్యే అవకాశముంది. 14శాతం ఓట్లకే కాంగ్రెస్ పరిమితమవుతుందని సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. కాగా, దేశవ్యాప్తంగా ఈసారి బీజేపీ హవా కొనసాగుతుందని ఈ సర్వేలో తేలింది. బీజేపీకి సొంతంగా 195 సీట్లు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిగా చూస్తే 229 సీట్లు గెలుచుకుని మెజారిటీకి 43 సీట్ల దూరంలో నిలవనుంది. కాంగ్రెస్కు 106 మాత్రమే వస్తాయని, యూపీఏ కూటమిగా చూస్తే 129 స్థానాల్లోనే నెగ్గుతుందని సర్వేలో వెల్లడైంది. థర్డ్ఫ్రంట్ 55, ఇతర పార్టీలు 106 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయిట.