ఎవరైతే నాకేంటి: టీడీపీకి వణుకు! బాబుకి పవన్ ప్రశ్న
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఝలకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన చీఫ్.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని రాజధాని భూసేకరణ పైన తీవ్రంగా నిలదీశారు. రైతుల కన్నీటితో భూసేకరణ అవసరమా, రాజధానికి 33 వేల ఎకరాల భూమి అవసరమా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
పవన్ పర్యటన టీడీపీ ప్రభుత్వానికి ఒక విధంగా వణుకు పుట్టించేదేనని చెప్పవచ్చు. తన పర్యటనలో పవన్.. ఒకవిధంగా ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికినప్పటికీ.. ఆయన టీడీపీ పైన అసంతృప్తితోనే ఉన్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టినందున తప్పని పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం చేశారని వార్తలు వచ్చాయి.
అయితే, ఇప్పుడు అనూహ్యంగా.. రాజధాని ప్రాంత రైతులతో మాట్లాడిన పవన్.. ఏపీ ప్రభుత్వం పైన నిప్పులు చెరగడం గమనార్హం. పవన్ తన పర్యటనలో ప్రభుత్వాన్ని నిలదీశారు. భూసమీకరణ ప్రాంత రైతులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు. రాజధాని సమీకరణ పైన పవన్ ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.
33వేల ఎకరాలు అవసరమా?
రాజధానికి 33వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు. అదీ రైతుల కన్నీటితో ఏర్పాటయ్యే రాజధాని అవసరం లేదని సూచించారు. రైతులు స్వచ్చంధంగా భూమి ఇస్తే తీసుకోవచ్చునని, దానికి తాను అభ్యంతరం చెప్పనని, కానీ బలవంతంగా తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని చెప్పారు. ప్రభుత్వం బలవంతానికి దిగితే తాను రాజధాని ప్రాంతంలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, ఆందోళన చేస్తానని చెప్పారు.
సింగపూర్ లాంటి రాజధానిపై...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లాంటి రాజధాని కోరుకుంటున్నారని, అందులో ఎలాంటి తప్పు లేదన్నారు. అయితే, విభజనతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఏపీకి, రైతుల కన్నీటితో వచ్చే రాజధాని ఎంత వరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
టీడీపీకి మద్దతిచ్చా.. ప్రశ్నిస్తున్నా...
విభజన నేపథ్యంలో అనుభవం ఉన్న చంద్రబాబు పాలన బాగుంటుందని తాను టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశానని చెప్పారు. అయితే, తాను మద్దతిచ్చిన ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీస్తానని ఆనాడే చెప్పానని, అన్నట్లుగానే నిలదీస్తున్నానని చెప్పారు.
ఇక పూర్తిస్థాయి రాజకీయాల్లోనా?
తాను అప్పుడప్పుడు వచ్చి పత్రిక స్టేట్ మెంట్ల కోసం చూడనని, రాజధాని ప్రాంత రైతులకు నష్టం జరిగిందని భావిస్తే, ఇక నుండి ఇక్కడే ఉండి పోరాడుతానని చెప్పారు. సమస్యల పైన ప్రభుత్వం పైన పోరాడుతానని చెప్పారు. తద్వారా సినిమాలు చేస్తూనే.. ఇక నుండి పూర్తిస్థాయి రాజకీయాల పైన దృష్టి సారిస్తానని చెప్పారని భావించవచ్చు. అంతేకాదు, అవసరమైతే సమస్యలు తీరే వరకు రాజధాని ప్రాంతంలోనే ఉంటానని చెప్పారు.
దైర్యంగా ఉండండి.. పోరాడుదాం
రాజధాని ప్రాంతంలోని రైతులు భూసమీకరణ పైన ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దని, ధైర్యంగా ఉండాలని పవన్ చెప్పారు. తాను ప్రభుత్వం పైన పోరాడుతానని హామీ ఇచ్చారు. భూసేకరణ చట్టం తెస్తే భయపడొద్దన్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.
పార్టీలకతీతంగా...
పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పైన పోరాడుతానని స్పష్టం చేశారు. టీడీపీకి ఓటేసినా, వైసీపీకి ఓటేసినా తనకు సంబంధం లేదని, ప్రజల కోసమే పోరాడుతానని చెప్పారు. నేను మద్దతిచ్చిన ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయకుంటే నిలదీస్తానని చెప్పారు.
ఎవరైనా మాట్లాడుతా..
రైతుల నుండి భూములు బలవంతంగా లాక్కుంటే తాను మాట్లాడుతానని, అవసరమైతే విజయవాడలో ఉంటానని పవన్ చెప్పారు. మంత్రులు, రాజధాని కమిటీ, ఏపీ సీఎం చంద్రబాబుతోని మాట్లాడుతానని చెప్పారు.