వవన్ కళ్యాణ్ మెంటర్: ఎవరీ రాజు రవితేజ?
హైదరాబాద్: తన వెనక సంపన్నులు, రాజకీయ నేతలు లేరని, జమ్మికుంటకు చెందన రాజు రవితేజ మాత్రమే ఉన్నారని పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో చెప్పారు. అప్పటి నుంచి ఆ రాజు రవితేజ ఎవరనే ఆసక్తి నెలకొంది. పవన్కల్యాణ్ 'ఇజం' అనే పుస్తకాన్ని 25న వెలువరించనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
ఆ పుస్తక ముఖ చిత్రం, వెనుక కవర్ ఫొటోలను సైతం విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని పవన్ కల్యాణ్తో కలిసి రాజు రవితేజ్ రాశారని కవర్ పేజీపై ఉంది. రాజురవితేజ్ స్వస్థలం కరీంనగర్ అని తెలుస్తోంది. ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగం 'యువరాజ్యం'కు పవన్కల్యాణ్ అధ్యక్షుడైతే, రవితేజ ఉపాధ్యక్షుడు.

రాజు రవితేజ తన ఉపన్యాసాలతో, సలహాలతో, పుస్తకాలతో ప్రభావితం చేసిన వ్యక్తి అని ఆయన నిర్వహిస్తున్న రాజు రవితేజ్ డాట్ కామ్ అనే పోర్టల్ ద్వారా తెలుస్తోంది. తనను తాను ఒక ఆలోచనాపరునిగా, ఉపన్యాసకర్తగా, రచయితగా, శిక్షకునిగా ఆ పోర్టల్లో ఆయన చెప్పుకున్నారు. ఆ పోర్టల్ ప్రకారం.. ఇప్పటికే ఆయన పలు దేశాల్లో ప్రసంగాలు చేశారు.
ఒక పేద కుటుంబానికి చెందిన రవితేజ్ పదహారేళ్ల వయసులో ఫంక్షన్ హాళ్లలో వెయిటర్గా కెరీర్ను ప్రారంభించారు. ఆఫీస్ బాయ్ స్థాయి నుంచి కంప్యూటర్ ప్రోగ్రామర్గా ఎదిగారు. 22 ఏళ్ల వయసులో యూరిస్కో కన్సల్టింగ్ను ప్రారంభించక ముందు వాణిజ్య ప్రకటనల రంగంలో కన్సల్టెంట్గా ఉన్నారు. భారత్తో పాటు ఇతర ఆసియా దేశాల్లోనూ, యూరప్లోనూ 100కు పైగా సంస్థలు సలహాదారునిగా ఆయన సేవలను వినియోగించుకున్నాయి.
దేశంలోని 65 విద్యా సంస్థలతో ఆయన కలిసి పనిచేశారు. ఎపిఎస్ఆర్టీసికి చెందిన 1,20,000 ఉద్యోగస్తులకు సంస్థ పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా శిక్షణనిచ్చారు. ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమాల్లో ఉపన్యాసాలిచ్చారు. మన సంస్కృతిపై ఒక షార్ట్ ఫిల్మ్కు స్క్రిప్ట్ సమకూర్చి, అందులో నటించారు. ఒక బాలీవుడ్ సినిమాకి కూడా స్క్రిప్ట్ సమకూర్చారు. ఆయన రచించిన 12 పుస్తకాల్లో 10 పుస్తకాలను దేశంలోని 183 స్కూళ్లలో పాఠ్యగ్రంథాలుగా చదువుతున్నట్టు ఆయన సైట్లో చెప్పుకున్నారు.
పిల్లల కోసం, యువత కోసం పుస్తకాలు రాస్తున్నారు. ఫిలాసఫీ గురించి రాస్తున్నారు. ఇప్పటివరకూ ఆయన నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొన్నారు. 1994లో 'యూరిస్కో కన్సల్టింగ్' అనే సంస్థనూ, 2002లో 'ఇన్స్పైర్ ఇండియా' అనే లాభాపేక్ష లేని ట్రస్టును ప్రారంభించారు.
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి అధికార ప్రతినిధులు ఎవ్వరూ లేరని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. జనసేన గురించి మీడియాతో చర్చల్లో ఎవరు మాట్లాడినా పార్టీకి వారితో ఎలాంటి సంబంధం లేదని అందులో స్పష్టం చేశారు. జనసేనకు సంబంధించిన ఏ విషయమైనా పవన్ మాత్రమే మాట్లాడతారని వివరించారు. పార్టీ నిర్మాణం, ప్రజలకు ఎలా సేవ చేయాలన్నదానిపై ఆరేళ్ల క్రితమే కల్యాణ్ పుస్తకం రాశారని ప్రకటనలో చెప్పారు.












Click it and Unblock the Notifications