ఢిల్లీలో బాబు: కేంద్ర మంత్రులతో చేతులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో గురువారం బిజీగా గడిపారు. ఒకే రోజు తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి కావాల్సినవాటి కోసం వారితో మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పలు విషయాలను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లారు.
ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీ వచ్చారు. ప్రాధాన్య రంగాలైన విద్యుత్తు, సాగునీరు, ఉన్నత విద్య, రైల్వేలతో పాటు ఇతర రంగాలకు సంబంధించి రాష్ట్ర అవసరాలను ఆయన కేంద్ర మంత్రులకు వివరించారు. తగిన ఆర్థిక సాయం చేయాలని కోరారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను 15 ఏళ్లకు పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో 3 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఆయన భేటీల పర్వం రాత్రి పది గంటల వరకు సాగింది. రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ సాయం రాబట్టడమే ధ్యేయంగా ఆయన భేటీలు సాగాయి.
మీడియాతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా విద్యుత్తుకు సంబంధించిన సహాయం అందించాలని తాను కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
వెంకయ్య నాయుడితో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
గోయల్తో భేటీ
విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి పియూష్ గోయల్తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విద్యుత్తు సమస్యలపై గోయల్కు ఆయన వివరించారు.
ఆరుణ్ జైట్లీతో భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశమయ్యారు. వీరిరువురి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు భేటీ జరిగింది. పలు కీలక విషయాలపై ఇరువురి మధ్య చర్చ సాగింది.
రాజ్నాథ్ సింగ్తో భేటీ
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం ఆర్డినెన్స్ కార్యరూపం దాల్చేలా త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
స్మృతి ఇరానీతో భేటీ
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన విద్యాసంస్థలపై ఆయన మాట్లాడారు.
ఉమాభారతితో భేటీ
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై ఆయన మాట్లాడారు.