చంద్రులు: మాటలు సరే, మంతనాలు? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మధ్య మాటలు కలిశాయి. వారి మధ్య మంతనాలు జరుగుతాయా అనేది సందేహంగానే ఉంది. అయితే, ఇరువురికి మధ్య గవర్నర్ నరసింహన్ అనుసంధానకర్తగా ఉండి, చర్చలకు ప్రాతిపదిక ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. తాము చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామని వారు గవర్నర్కు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.
గవర్నర్ శుక్రవారం సాయంత్రం రాజభవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య మాటలు కలిసినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య చర్చలకు నరసింహన్ మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ రాక సందర్భంగా ఈనెల 3వ తేదీన ఇద్దరు నేతలు పరస్పరం చేతులు కలుపుకుని, కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. ఈసారి మాత్రం గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇరువురు ముఖ్యమంత్రులు దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

చంద్రబాబుకు స్వాగతం
ఎట్ హోం కార్యక్రమానికి రాజభవన్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న గవర్నర్ నరసింహన్

నమస్కారానికి ప్రతి నమస్కారం
రాజభవన్ వచ్చిన చంద్రబాబు నాయుడు గవర్నర్కు నమస్కారం చేస్తే అందుకు ఆయన ప్రతినమస్కారం ఇలా..

కెసిఆర్తో గవర్నర్ కరచాలనం...
ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనడానికి రాజభవన్ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు స్వాగతం చెబుతూ కరచాలనం చేసిన గవర్నర్

గవర్నర్కు ఇరువైపులా..
గవర్నర్ నరసింహన్ ఇరువురు ముఖ్యమంత్రులను తనకు ఇరువైపులా కూర్చోబెట్టుకుని పిచ్చాపాటి మాట్లాడారు.

ప్రత్యేక ఆకర్షణ వారే...
ఎట్ హోం కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

గవర్నర్ దంపతులతో...
గవర్నర్ దంపతులతో ఇరువురు ముఖ్యమంత్రులు ఫొటోకు ఇలా ఫోజులు ఇచ్చారు. ఇద్దరు చేతులు కలుపుకుంటారా, మాట్లాడుకుంటారా అనేది ఎట్ హోంలో ఆసక్తి కలిగించిన విషయం.

ఇరువురినీ తోడ్కొని....
ఇరువురు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావులను తోడ్కొని గవర్నర్ ఇలా సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.

నరసింహన్ మాటలు కలిపారు...
తనకు ఇరువైపులా ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టుకుని గవర్నర్ నరసింహన్ జెండా పండుగ ముచ్చట్లు అడిగి తెలుసుకున్నారు.

ఇద్దరూ మాట్లాడుకున్నారు..
గవర్నర్ ఇతర అతిథులను ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు చంద్రబాబు, కెసిఆర్ పరస్పరం నవ్వుతూ మాట్లాడుకున్నారు. అదే సమయంలో జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఇరువురు సీఎంలతో కొద్దిసేపు మాట్లాడారు.

పూర్ణకు ఆశీర్వాదాలు...
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన చిన్నారి పూర్ణను గవర్నర్ నరసింహన్ ఆశీర్వాదించారు. పక్కనే చంద్రబాబు కూడా ఉన్నారు.

పూర్ణతో గవర్నర్ కరచాలనం..
ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణతో గవర్నర్ నరసింహన్ కరచాలనం చేశారు. పక్కనే ఆనంద్, కోచ్ కూడా ఉన్నారు.

దత్తాత్రేయ, పొన్నాల...
తెలంగాణ బిజెపి పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయకు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలను పలకరిస్తూ గవర్నర్...

ఇలా మాటలు కలిపారు...
చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర రావు ఇలా మాటలు కలిపారు. వారి మధ్య వాతావరణాన్ని గవర్నర్ తేలిక పరిచారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజు సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ‘ఎట్ హోం' పేరుతో అల్పాహార విందు ఇవ్వడం అనవాయితీ. ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులకు గవర్నర్ స్వయంగా ఫోన్ చేసి తప్పక రావాలని సూచించినట్లు సమాచారం. దీంతో రాకుండా ఉండలేని పరిస్థితి ఇరువురికి కలిగిందని అంటున్నారు. ఎట్ హోం కార్యక్రమంలో వారిద్దరినీ తన పక్కన కూర్చోపెట్టుకున్నారు. ముందుగా రాజకీయేతర విషయాలపై ముచ్చట్లు పెట్టారు.
గోల్కొండ కోటలో పతాకావిష్కరణకు ఉన్న వసతుల గురించి కెసిఆర్ను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎట్ హోం కార్యక్రమం ముగింపునకు సంకేతంగా జాతీయ గీతాలాపన జరిగే దాకా వారి మధ్య అనేక అంశాలపై పిచ్చాపాటీ సంభాషణలు జరిగాయి. ఆ తర్వాత చంద్రబాబు, కెసిఆర్లను గవర్నర్ రాజ్భవన్లోకి తీసుకెళ్లారు. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు.
విభజన వల్ల సమస్యలు రావడం సహజమని, అయితే చర్చలు చేస్తే చాలా ఇక్కడే పరిష్కారమవుతాయని గవర్నర్ వారిద్దరికీ సూచించినట్లు సమాచారం. చర్చల ద్వారా పరిష్కారం కానవాటిని తమకు వదిలిపెట్టాలని ఆయన సూచించినట్లు వార్తలు వచ్చాయి. తనకేమీ పట్టింపులు లేవని, కలిసి మాట్లాడుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తాను పలుమార్లు చర్చలకు సిద్ధమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను కెసిఆర్కు లేఖ కూడా రాశానని చెప్పినట్లు తెలుస్తోంది.
సమస్యలు సామరస్యంగా పరిష్కారమైతే తనకు కూడా మంచిదేనని, పెద్ద మనిషిగా కూర్చుకుని మాట్లాడుకోవాలని చెప్తే తాను వ్యతిరేకించేవాడిని కాదని, రాష్ట్రం వచ్చిన పేరే గానీ సంతోషం లేదన తమ వాళ్లు బాధపడుతున్నారని, కేంద్రం కూడా పట్టించుకోవడం లేదని కెసిఆర్ అన్నట్లు చెబుతున్నారు. అయితే, త్వరలోనే భేటీ జరగాలని గవర్నర్ అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications