మోడీకి ముస్లిం యువతి లేఖ: 10రోజుల్లోనే ఊహించని స్పందన..
బ్యాంకుల తీరుతో విసిగిపోయిన సదరు యువతి ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఉన్నత చదువు చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది.
మాండ్యా: డిగ్రీ పూర్తి చేసిన ఓ యువతి ఆపై ఉన్నత చదువులు చదివేందుకు బ్యాంకుల ద్వారా రుణం పొందాలనుకుంది. అనుకున్నట్లుగానే ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకులకు ఆర్జీ పెట్టుకుంది. అయితే బ్యాంకులు వ్యవహరించిన తీరు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. లోన్ ఇవ్వకపోగా.. చీటికి మాటికి బ్యాంకు చుట్టూ తిప్పించుకున్నారు.
బ్యాంకుల తీరుతో విసిగిపోయిన సదరు యువతి ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఉన్నత చదువు చదువుకోవడం కోసం ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది. స్పందించిన పీఎంవో కార్యాలయం తక్షణం కర్టాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో.. ఇప్పుడు ఆ యువతి ఆశ నెరవేరనుంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని షుగర్ టౌన్ ప్రాంతానికి చెందిన బీబీ సారా(21) అనే ముస్లిం మహిళ ఇటీవల ప్రధాని మోడీకి లేఖ రాసింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనకు ఉన్నత చదువులు చదవాలని ఉందని, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని లేఖలో పేర్కొంది. అంతేకాదు, ఎడ్యుకేషన్ లోన్ కోసం బ్యాంకులను సంప్రదించినా.. ఏ ఒక్క బ్యాంకు తనకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆమె ప్రధానికి లేఖ రాయగా.. పదిరోజుల్లో ఆమెకు పీఎంవో కార్యాయలం నుంచి జవాబు వచ్చింది.
బీబీ సారాకు విద్యా రుణం మంజూరు చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రధాని మోడీ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో కర్ణాటక ప్రధాన కార్యదర్శి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించారు. విజయ బ్యాంకు నుంచి రూ.1.50లక్షల లోన్ ను ఆమెకు ఇప్పించారు.
కుమార్తెకు ఆర్థిక సహాయం అందడం పట్ల మైసూర్ షుగర్ మిల్లులో పనిచేస్తున్న సారా తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని స్పందనపై బీబీ సారా కృతజ్ఞతలు తెలిపింది. తన లేఖపై ప్రధాని స్పందిస్తారని ముందే భావించానని సారా తెలిపింది.












Click it and Unblock the Notifications