లిక్కర్ బిజినెస్పై పట్టు రాజకీయ నేతలదే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో మద్యం వ్యాపారంపై రాజకీయ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. విజయవాడలోని కృష్ణలంకలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో కాంగ్రెసు నాయకుడు మల్లాది విష్ణుపై కేసు నమోదు చేశారు.
దీన్ని బట్టి దశాబ్దాల కాలంగా విజయవాడ మద్యం వ్యాపారం రాజకీయ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్లు అర్థమవుతోంది. నగరంలో పలు చోట్ల అక్రమ మద్యం వ్యాపారం సాగుతున్నప్పటికీ ఆబ్కారీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పలు వైన్ షాపులు మద్యం విక్రయించడంతో పాటు అక్కడే సేవించడానికి ఏర్పాట్లు చేశాయి. కొన్ని షాపులు డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాయి. తమ బంధువుల పేర్ల మీద లిక్కర్ వ్యాపారంపై రాజకీయ నేతలు పట్టు సాధించినట్లు చెబుతున్నారు.
మల్లాది విష్ణు చాలా కాలంగా మద్యం వ్యాపారంలో ఉన్నారు. పలువురి పేర్ల మీద ఆయనకు వైన్ షాపులు ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యుడికి కూడా నగరంలో రెండు వైన్ షాపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ మహిళా కార్పోరేటర్ భర్తకు కూడా పలు వైన్ షాపులు ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడ నగరంలో అతను బలమైన వ్యక్తి.
ఓ పార్లమెంటు సభ్యుడి బంధువులకు కూడా మచిలీపట్నంలోనూ దాని పరిసరాల్లోనూ వైన్ షాపులు ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అధికారులతో అవగాహనకు వచ్చి రాజకీయ నాయకులు పరస్పర అవగాహనతో ఈ మద్యం దుకాణాలను పొందినట్లు చెబుతారు.