రాయల తెలంగాణ: కెసిఆర్ను వంచడానికేనా?
తెలంగాణ రాష్ట్ర ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని కెసిఆర్ ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే సమయానికి ఆయన మాట మార్చారు. తొలుత కాస్తా మెత్తగా మాట్లాడినప్పటికీ ఆ తర్వాత గట్టిగానే మాట్లాడుతూ వచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తాము ప్రధాన పాత్ర వహించాలి కాబట్టి కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేయబోమని చెబుతున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత విలీనం గురించి ఆలోచిస్తామని అంతకు ముందు ఆయన చెబుతూ వచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెరాసను విలీనం చేసుకోవడం ద్వారా ఈ కొత్త రాష్ట్రంలోని లోకసభ సీట్లను అన్నింటినీ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉంది. అయితే, దానికి కెసిఆర్ వైఖరి అడ్డంకిగా మారింది. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపడం ద్వారా కెసిఆర్ ప్రాబల్యాన్ని తగ్గించవచ్చునని ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కెసిఆర్ అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా ఆ రెండు జిల్లాల్లోని స్థానాలను, తెలంగాణలో వచ్చే సీట్లను కలుపుకుని రాయల తెలంగాణలో ఆధిపత్యం సంపాదించవచ్చుననేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అయితే, బిజెపి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో రాయల తెలంగాణ అనేది సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
తెలంగాణ కాంగ్రెసు నాయకులు కూడా రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని మెజారిటీ నాయకులు కూడా దానికి సుముఖంగా లేరు. అందువల్ల రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యూహాత్మకంగానే తెర పైకి తెచ్చి, వ్యూహాత్మకంగానే వెనక్కి తీసుకుంటుందా అనేది కూడా చెప్పలేం.