కెటిఆర్ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి: ఎందుకంటే..
హైదరాబాద్: కాంగ్రెసు నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావును టార్గెట్ చేశాడు. కెటిఆర్ను ఆయన లక్ష్యం చేసుకోవడంలో పక్కా వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది.
కెటిఆర్ను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి కుంభస్థలాన్ని కొట్టాలని భావిస్తున్నట్లు ఉన్నారు. ఆయన ఆరోపణలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన సమాధానం రావడం లేదు. గత రెండు రోజులుగా రేవంత్ రెడ్డి అదే ఆరోపణ చేస్తూ వస్తున్నారు.
కెటిఆర్ను కెసిఆర్ ఇలా...
కెటి రామారావును కెసిఆర్ తన వారసుడిగా దాదాపుగా ముందుకు తెచ్చినట్లే. గతంలో కలెక్టర్లందరితో గ్రూప్ ఫొటో దిగడం ద్వారా కెసిఆర్ తర్వాతి స్థానం తనదేనని కెటిఆర్ ప్రకటించుకున్నారు. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ పర్యటన, హైదారాబాదు మెట్రో రైలు ప్రారంభోత్సవం కెటిఆర్ను మరోసారి కెసిఆర్ తర్వాతి స్థానంలో నిలబెట్టింది. దాదాపుగా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కెటిఆర్ ముందుకు వచ్చినట్లే.
అందుకే కెటిఆర్ను టార్గెట్ చేసిన రేవంత్
భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కెటిఆర్ ముందుకు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రకంగా ఆయన ప్రతిష్టను దెబ్బ తీయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు. వరుసగా కెటిఆర్కు గురిపెట్టి ఆయన ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.
రేవంత్ చేసిన ఆరోపణ ఏమిటి..
కెటి రామారావు మామ పరాల హరినాథ రావు తప్పుడు సర్టిఫికెట్తో ఎస్టీ కోటాలో ఉద్యోగం సంపాదించుకుని, ఉద్యోగం చేసి, పదేళ్లుగా పింఛను పొందుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. ఇది సమాజాన్ని మోసం చేయడమేనని, తను ఎస్టీ అని చెప్పుకుని డిఎఫ్వో ఉద్యోగం చేసినట్లు తాము ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించామని రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని కాగితాలను కూడా ఆయన చూపించారు.
కెసిఆర్ను ఆత్మరక్షణలో పడేశారా....
వ్యూహాత్మకంగా ఆరోపణలు చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడేశారని అంంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అంటున్నారే తప్ప తెరాస నాయకులు హరినాథ రావు సర్టిఫికెట్పై వివరణ ఇవ్వడం లేదు. హరనాథ రావు అలా సర్టిఫికెట్ తీసుకున్నది నిజమా, కాదా అనే విషయంపైకి వెళ్లడం లేదు.