జల్లికట్టు ఆందోళన వెనక శశికళ: బెడిసికొట్టిందా?
జల్లికట్టు ఆందోళన వెనక చిన్నమ్మ శశికళ హస్తం ఉందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, క్రమంగా అది ఆమె చేయి దాటిపోయిందని అంటున్నారు.
చెన్నై: జల్లికట్టు ఉద్యమం వెనక అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. జల్లికట్టును కొనసాగనివ్వాలని కోరుతూ ఆమె కేంద్రానికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. జల్లికట్టు ఉద్యమానికి ఆమె తొలుత సహకారం అందించినట్లు చెబుతున్నారు.
అయితే, క్రమం అది ఆమె చేయి దాటిపోయి, హింసాత్మకంగా మారినట్లు చెబుతున్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఈ నెల మొదట్లో ఆందోళనలు ప్రారంభమై సంక్రాంతి నాటికి జోరందుకున్నాయి. 16వ తేదీన వందమంది విద్యార్థులు చెన్నై మెరీనా తీరంలో దీక్ష ప్రారంభించారు. జల్లికట్టుకు మద్దతుగా, పెటాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
మొదటి రోజు వారికి పెద్దగా మద్దతు లభించలేదు. కానీ మరునాడు ఐదు వేల మంది యువతీయువకులు వచ్చి చేరారు. దానికి ఉద్యమ ప్రారంభకులే ఆశ్చర్యపోయారని అంటున్నారు. శశికళ సహకారం ఉండడం వల్లనే అలా మొదలై క్రమంగా ఊపందుకున్నట్లు చెబుతున్నారు.
మోడీపై ఆగ్రహంతో శశికళ ఇలా...
ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహంగా ఉండడంతో పాటు జల్లికట్టు సాధించుకోవాలనే ఉద్దేశంతో శశికళ ఈ ఆందోళనకు సహకరించినట్లు చెబుతున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేయించి, ఆ తర్వాత తాను రంగంలోకి దిగి, ఆందోళనను విరమింపజేసి, క్రెడిట్ను సొంతం చేసుకోవాలనే వ్యూహంతో శశికళ పనిచేసినట్లు చెబుతున్నారు. మెరీనా తీరంలో ఆందోళనలో పాల్గొన్న వేల మందికి అన్నపానీయాలు అందించడం వెనక శశికళ మనుషులు ఉన్నట్లు భావిస్తున్నారు.
సినీ ప్రముఖుల ప్రవేశం...
మెరీనా బీచ్ ఆందోళనకు సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖుల మద్దతు ఇచ్చారు. దీంతో జల్లికట్టుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చర్చ సాగింది. ఇతర పార్టీల మద్దతును యువకులు తిరస్కరించారు. దీంతో పలు పార్టీల నాయకులు అలక వహించారు. డీఎంకే నేత స్టాలిన నిరాహారదీక్షకు కారణం ఇదేనని సమాచారం. శశికళ ప్రవేశంతో విద్యార్థులు కూడా ఉద్య మం నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు.
ఇలా శశికళ చేయి దాటిపోయింది....
మెరీనా చుట్టుపక్కలున్న కుటుంబాలకు చెందినవారు, వివిధ పార్టీల కార్యకర్తలు మెరీనాలో బైఠాయించినట్లు చెబుతున్నారు. మహిళలూ భారీగా తరలివచ్చారు. అల్లరి మూకలు మెరీనా తీరంలో సంచరించడంపై ప్రభుత్వానికి ఇంటెలిజెన్స విభాగం సమాచారం అందించింది. ఆందోళనకారుల సం ఖ్య పెరగడంతో పరిస్థితి శశికళ చేయి దాటిపోయిందని చెబుతున్నారు.
శాంతించిన చెన్నై నగరం...
సోమవారంనాడు అట్టుడికిన చెన్నై మంగళవారం శాంతించింది. నగర జీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు పనిచేశాయి. అయితే 100 మంది ఉద్యమకారులు మెరీనాలో మంగళవారం కూడా ఆందోళన చేశారు. ఆర్డినెన్స్కు తమిళనాడు అసెంబ్లీ చట్టబద్ధత కల్పించినా రాష్ట్రపతి సంతకం తరువాతే ఆందోళన విరమిస్తామని చెప్పారు.