ఝలక్: గజ్వెల్లో కెసిఆర్కు, జనగాంలో పొన్నాలకు
హైదరాబాద్: మెదక్ జిల్లా గజ్వెల్ శాసనసభా నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు ఝలక్ ఇచ్చింది. ఆయన పోటీ చేసిన మెదక్ జిల్లా గజ్వేల్ శాసనసభా నియోజకవర్గంలో తెరాస ఒక్క జడ్పీటీసీ కూడా గెలుచుకోలేకపోయింది. నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ను, ఆయన ఫామ్హౌస్ ఉన్న జగదేవ్పూర్ను, దీంతో పాటు వర్గల్ జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. తూప్రాన్, ములుగు, కొండపాక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఎంపిటిసి స్థానాలకు సంబంధించి గజ్వెల్ నియోజకవర్గంలో మొత్తం 81 స్థానాలుండగా తెరాస 12 మాత్రమే గెలవగలిగింది. జగదేవ్పూర్, వర్గల్ మండలాల్లో కనీసం ఒక్క ఎంపిటిసిని కూడా తెరాస దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ 36, తెలుగుదేశం 33 స్థానాల్లో విజయం సాధించాయి. చాలా స్థానాల్లో తెరాస అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

గజ్వేల్ మండలంలో 2, తూఫ్రాన్ మండలంలో 2, కొండపాక మండలంలో 4, ములుగు మండలంలో 4 ఎంపిటిసి స్థానాలకే తెరాస పరిమితం కావాల్సి వచ్చింది. కొత్తగా ఆవిర్భవించిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో 20 వార్డులుండగా, టిడిపికి 10, తెరాసకు 9, కాంగ్రెస్ 1 స్థానం దక్కాయి.
ఇదిలా వుంటే, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఊహించని షాక్ తగిలింది. స్వగ్రామమైన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో టిడిపి విజయకేతనం ఎగురవేసింది. ఆయన లోక్సభ బరిలో దిగిన జనగామ పరిధిలోని జడ్పీటీసీ స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఖిలాషాపురం ఎంపిటిసి స్థానం నుంచి టిడిపి అభ్యర్థి భూశెట్టి కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల రాణిసంయుక్తపై విజయఢంకా మోగించారు. రాణి సంయుక్త పొన్నాల సోదరుడి భార్య.












Click it and Unblock the Notifications