బెడసికొట్టిన డ్రాగన్ వ్యూహం: చైనాకు ఊహించని షాకిచ్చిన భారత్
బ్రసెల్స్: భారత్-చైనా సరిహద్దు వివాదంపై ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్ట్ జార్నెస్కీ స్పందన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. భూటాన్ దేశ సరిహద్దులోకి చొచ్చుకునే వచ్చేందుకు చైనా దళాలు యత్నించిన విషయం తెలిసిందే. దీంతో భూటాన్ దేశానికి మద్దతుగా భారత్ నిలిచింది. అంతేగాక, భూటాన్, భారత సరిహద్దులోకి ఒక్క అంగుళం కూడా రానీయకుండా చైనా దళాలను కట్టడి చేశాయి భారత భద్రతా దళాలు. ఈ నేపథ్యలో రిజార్ట్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనాకు భారత్ ఊహించని షాక్
డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్పెర్లిలోని భూటాన్ సైనిక శిబిరం వైపు రోడ్డు నిర్మాణం విషయంలో దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరించిన చైనా భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ గట్టిగా రంగంలోకి దిగుతుందని ఊహించలేక పోయిందని ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్డ్ జార్నెస్కీ అభిప్రాయ పడ్డారు.
Recommended Video
చైనా మొదట్నుంచీ అంతే..
తమ ఎదుగుదల ప్రపంచ దేశాల శాంతికి ఏ విధంగాను ముప్పుకాదని, నిజానికి శాంతియుత అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందంటూ చైనా ప్రపంచ దేశాలకు చెప్పిన అబద్ధాల గుట్టును సైతం యూరోపియన్ పార్లమెంటు కోసం రాసిన ఓ వ్యాసంలో జార్నెస్కీ బట్టబయలు చేశారు. నిజానికి చైనా మొదటినుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన నిబంధనలకు విరుద్ధంగా ఉండే విదేశాంగ విధానాన్నే అనుసరిస్తూ వస్తోందని ఆయన అన్నారు.
డొక్లాం చక్కటి ఉదాహరణ
ప్రధానంగా డోక్లాంలోని ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా, భారత్, భూటాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ- మిలిటరీ ఉద్రిక్తత ఈ విధానానికి ఒక చక్కటి ఉదాహరణ అని జార్నెస్కీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
ఏకపక్షంగా మార్చేందుకు చైనా కుట్ర
డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్పెల్రిలోని భూటాన్ ఆర్మీ క్యాంప్ దిశగా సైనిక వాహనాలు తిరగడానికి అనువుగా ఉండే రోడ్డును నిర్మించాలని జూన్ 16న చైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని జార్నెస్కీ అన్నారు. వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యకలాపాలపై భూటాన్ దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం చెప్తుందని చైనా ముందే ఊహించిందని, అయితే భూటాన్ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి భారత్ రంగంలోకి దిగుతుందనే విషయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పారు. డోక్లాం ప్రాంతంలో చైనా చర్య వివాదాస్పద ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను ఏకపక్షంగా మార్చి వేసే ఇటీవలి దాని ధోరణిలో భాగంగానే చూడవచ్చునని జార్నెస్కీ తన వ్యాసంలో పేర్కొన్నారు.
బేఖాతరు చేస్తూ...
అంతేగాక, దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులకు సంబంధించి ఈ ప్రాంతంలోని మలేసియా, వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పీన్స్ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక పట్టును విస్తరించుకోవడం దీనికి ఓ చక్కటి ఉదాహరణ అని జార్నెస్కీ స్పష్టం చేశారు.
చైనా నమ్మడం కష్టమే..
డోక్లాం విషక్షంలో భూటాన్ సైనికంగా ప్రతిస్పందించలేదని, రోడ్డు నిర్మాణం కొద్ది వారాల్లోనే పూర్తవుతుందని, దీంతో వ్యూహాత్మకంగా తమదే పైచేయి అవుతుందని చైనా భావించి ఉండవచ్చని, అయితే అంతా అది అనుకున్నట్లుగా జరగలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ప్రధాన లక్ష్యంతో భారత సైన్యాలు రంగం ప్రవేశం చేస్తాయని చైనా ఎంతమాత్రం ఊహించి ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో భారత్ను దోషిగా నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం, దాని అధికార ప్రచార యంత్రాంగం ఎంతగానో ప్రయత్నించాయని ఆయన ఆ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. ఆ ప్రాంతంనుంచి భారత సైన్యాలు వెనక్కి వెళ్లేంతవరకు ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరపబోమని ఇప్పుడు చైనా పట్టుబడుతోందని కూడా ఆయన అన్నారు. అయితే, అంతర్జాతీయ చట్టాలను గౌరవించకుండా ముందుకెళితే మాత్రం చైనాకు కష్టమేనని జార్నెస్కీ స్పష్టం చేశారు.