సోనియా, పివిల మధ్య రాజీవ్ హత్య కేసు చిచ్చు
న్యూఢిల్లీ: పివి నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మధ్య సంబంధాలు అంతంత మాత్రమేనని తాజాగా ఓ పుస్తకం వెలువడింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో దర్యాఫ్తు నత్త నడకన సాగడంపై సోనియా అసంతృప్తిగా ఉన్నారన్నారు. కేంద్రమంత్రి కెవి థామస్ రాసిన 'సోనియా.. ద బిలవ్డ్ ఆఫ్ ది మాసెస్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
పివి ప్రభుత్వ పనితీరుపై తన అసంతృప్తిని సోనియా బహిరంగంగానే వ్యక్తం చేశారని తెలిపారు. రాజీవ్ జయంతి సందర్భంగా 1995లో సోనియా ప్రసంగాన్ని థామస్ ఉదాహరించారు. ఆరోజు ఆమె మాటలు జాతి మొత్తాన్ని బాధించాయని తెలిపారు. పివితో అంత సాన్నిహిత్యమేమీ లేని సోనియా.. రాజీవ్ హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన ప్రభుత్వాన్ని తప్పు బట్టారని, ఒక మాజీ ప్రధాని హత్య కేసు దర్యాప్తునకే ఇంత సమయం పడితే న్యాయం కోసం పోరాడే ఒక సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆమె తీవ్రంగా ఆవేదన చెందారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు సోనియా విసిరిన వాగ్బాణాలు అప్పటి ప్రధాని పివిని అభిశంసించడమేనని థామస్ వ్యాఖ్యానించారు. పివి అధికారంలో ఉన్నంత వరకు రాజీవ్ హత్య కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంటుందని కూడా సోనియా భావించారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
రాజీవ్ హత్యకు వేరెవరో వ్యూహ రచన చేశారని దానిని ఎల్టీటీఈ ద్వారా అమలు చేశారని సోనియా భావిస్తున్నారని, ఇటువంటి పరిస్థితులే ఆమె రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయని, పార్టీ పునాదులే కుంగిపోతున్నప్పుడు ఆమె సాక్షిగా ఎలా ఉండగలరని ఆ పుస్తకంలో వ్యాఖ్యానించారు. కాగా, పివిని సోనియా అవమానించారని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కూడా వ్యాఖ్యానించారు. గత వారంలో ఢిల్లీలోని ఓ దిన పత్రికకు ఆయన వ్యాసం రాశారు.