ఎమ్మెల్యేలు డుమ్మా: జగన్ పార్టీలో గందరగోళం!
కాగా, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానంలో ఆందోళన ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు వలస బాట పట్టకుండా వారితోనే.. తాము పార్టీని వీడటం లేదని చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయమే వేదికగా వరుసగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ సదరు నేతలతో తాము పార్టీ వీడి వెళ్లమని ప్రకటన చేయించడం చర్చకు దారి తీస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. అదే రోజు కర్నూలు ఎమ్మెల్యే బుట్టా రేణుక కూడా పార్టీ వీడుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆమె టిడిపికి అనుబంధంగా ఉంటానని చెప్పి ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా టిడిపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడటం లేదని ప్రకటించారు. తాజాగా గుంటూరు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సాగడంతో... ఆయన కూడా కార్యాలయం వేదికగా ప్రకటన చేశారు. అయితే ఇలా ప్రచారం జరగడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆందోళన కలిగిస్తోందంటున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు లభించింది. జగన్ పార్టీ ఇప్పటి దాకా రిజిస్టర్డ్ పార్టీ. ఇక మీదట గుర్తింపు పొందిన పార్టీ అవుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్టీ గుర్తులపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు.