బాబు, జగన్లకు సర్వే షాక్: కెసిఆర్కు ఆంధ్ర మార్కులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓ సర్వే షాక్ ఇచ్చింది. కష్టపడి పనిచేస్తున్నా చంద్రబాబు ఫలితాలు సాధించలేకపోతున్నారు, అవినీతిని అరికట్టలేకపోతున్నారు, మంత్రులను అదుపు చేయలేకపోతున్నారని సిఎంఎస్ సర్వే తేల్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సర్వే షాక్ ఇచ్చింది.
చంద్రబాబు రెండేళ్ల పాలనపై సిఎంఎస్ మార్చి నెలలో జరిపిన సర్వే ఫలితాలను సంస్థ అధినేత డాక్టర్ ఎన్. భాస్కర్రావు గురువారం మీడియా సమావేశంలో విడుదల చేశారు. కొత్త రాజధాని నిర్మాణం, పాలన విషయంలో చెబుతున్నది ఒకటి, జరుగుతోంది మరొకటని ప్రజలు భావిస్తున్నట్లు సర్వే తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే పథకాలు బాగా అమలవుతున్నాయని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నట్లు సర్వే తేల్చింది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయగలుగుతారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన నడుస్తోందని ప్రజలు భావించటం లేదని సర్వే తేల్చింది. పథకాల ప్రకటన ఉధృతంగా ఉన్నది తప్ప, అమలు జరగడం లేదని ప్రజలు భావిస్తున్నారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వం పని తీరును సమీక్షించేందుకు ఈ సర్వే జరిపినట్లు భాస్కర్రావు వెల్లడించారు. ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి - చంద్రబాబు రాజకీయ ఎదుగుదల ఆగిపోయినా ఆ ఖాళీని భర్తీచేసే స్థాయికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎదగలేకపోతోంది.

కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ బాగా మెరుగుపడటం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నా ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సేవలు సక్రమంగా లేకపోవటం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రైతుల రుణ మాఫీ, పింఛన్లు పెరగటం పట్ల ప్రజల్లో కొంత సంతృప్తి ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారని యువత అభిప్రాయపడుతోంది.
అభివృద్ధి పథకాల అమలు విషయంలో కొన్ని జిల్లాలకు అధిక ప్రాధాన్యత లభించటం వల్ల రాష్ట్రం ఒకటిగా ఉండగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, మొత్తంమీద రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని అరికట్టకలుగుతుందని ప్రజలు విశ్వసించడం లేదు.

చంద్రబాబు తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించినా, అవినీతిలో ఇతర రాష్ట్రాలతో పోటీపడుతోంది. రెవెన్యూ, పోలీసు శాఖలు అవినీతిమయం అయ్యాయని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో కూడా అవినీతి బాగా పెరిగింది. రెండేళ్లనుండి అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమైంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు కూడా రాజకీయంగా పెద్దగా పుంజుకోలేదు, ప్రజల మద్దతు సంపాదించుకోవటంలో ఆ పార్టీ కూడా విజయం సాధించలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం పూర్తిగా కోల్పోయినట్లే.
కెసిఆర్కు ఆంధ్ర ప్రజల మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం బాగా పని చేస్తోందని ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగుంది, ప్రజలను కలుపుకుని పని చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనతో పోలిస్తే తెలంగాణలో పరిపాలన మెరుగ్గా ఉందని ప్రజలు తెలిపారు. ఆ రాష్ట్ర పాలనలో ఫలితాలు ప్రజలకు కనిపించేలా ఉన్నాయి

ఉదాహరణకు చెరువుల పూడికతీత వంటి పథకాలు విజయవంతం అయ్యాయన్నారు. ఏపీలో ఆ రీతిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకపోవటం వల్లనే ఈ అభిప్రాయం ఏర్పడిందని భాస్కర్ రావు అన్నారు.
ఏదేమైనా, రెండేళ్ల వయసున్న రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ఇప్పుడే ఒక అంచనాకు రావటం సరికాదని, తమ మదింపు సర్టిఫికెట్ కాదన్నారు. ప్రభుత్వం ఏ దిశగా ముందుకెళుతోంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పాలనుకున్నామన్నారు. మోడీ ప్రభుత్వ పనితీరుపై కూడా మదింపు జరిపామని, త్వరలోనే వివరాలను ప్రకటిస్తామన్నారు.
అమరావతి భయం
కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నా, ఆ శ్రమను ప్రజలు విశ్వసించటం లేదని తేల్చింది. సర్వే ఇంకా ఇలా చెప్పింది - అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా జరగటం లేదని ప్రజలు భావిస్తున్నారు. ఏపీలో మాత్రం రాజధాని వస్తే ప్రభుత్వం మరింత దూరమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, భారీ ప్రణాళికలే దీనికి కారణమని చెప్పారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చాలాబాగా కష్టపడుతున్నారని ప్రజలు చెప్పారు. కానీ, రాష్ట్రంలో మున్ముందు ప్రాంతీయతత్వం, కులతత్వం వల్ల ఉద్యమాలు వస్తాయని ప్రజలు భావిస్తున్నారన్నారు.
చంద్రబాబుకు వ్యక్తిగత మార్కులు
ప్రభుత్వ పాలన కంటే చంద్రబాబు వ్యక్తిగత కృషిని మెచ్చుకున్నవారు ఎక్కువ మంది ఉన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సరితూగగల మంత్రి ఒక్కరూ లేరని ప్రజలు చెప్పారని భాస్కరరావు వెల్లడించారు. పరిపాలనలో చంద్రబాబుకు మద్దతుగా నిలవగల మంత్రి కూడా ఒక్కరూ లేరని వారు తెలిపారన్నారు.












Click it and Unblock the Notifications