కెసిఆర్ వ్యతిరేక శక్తులతో రేవంత్ ప్లాన్: పవన్ కల్యాణ్ కూడానా..,
తెలంగాణలో కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. టిడిపితో పవన్ కల్యాణ్ కల్యాణ్ కలిసి వస్తారా అనే విషయంపై చర్చ సాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యతిరేక శక్తులను కూడగట్టే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఉందా? అవునని అంటున్నారు టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కెసిఆర్కు వ్యతిరేకంగా సిపిఎం ఓ వైపు పావులు కదుపుతుండగా, రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ జనసేనతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర చిన్నపార్టీలు రాష్ట్రంలో ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు ప్రజా గాయకుడు గద్దర్ నడుం బిగించినట్లు తెలుస్తోంది. గద్దర్తోనూ పవన్ కల్యాణ్తోనూ చర్చలు జరుపుతామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం మీట్ ది ప్రెస్లో చెప్పారు.
ఎన్నికల సమయానికి ఉభయ కమ్యూనిస్టులు, జనసేన, ఇతర చిన్న పార్టీలతో ఏర్పడే కూటమి టిడిపితో కలిసి పనిచేసే అవకాశాలున్నాయా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి వామపక్షాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటూ వచ్చాయి. అందువల్ల దాన్ని కాదనలేమనే మాట కూడా వినిపిస్తోంది.

తెలంగాణలో సీట్లు ఎలా పెరుగుతాయి...
వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు యువతకు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అది జరిగితే ప్రస్తుతం ఉన్న 119 సీట్లు 153కు పెరుగుతాయి. తమ పార్టీ తెరాసకు ప్రధాన ప్రత్యర్థి అని రేవంత్ రెడ్డి అన్నారు. నలుగురు కెసిఆర్ కుటుంబ సభ్యులు ఓ వైపు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మరో వైపు ఉంటారని ఆయన అన్నారు. తాము కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో తెరాసకు గట్టి సమాధానం ఇస్తామని ఆయన అన్నారు.

టిడిపి చచ్చిన పాము...
తెలంగాణలో టిడిపి చచ్చిన పాము అని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. దానిపై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. తెరాసలో హరీష్ రావు పరిస్థితి చచ్చిన పాముకన్నా హీనంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కె. చంద్రశేఖరరావుపై, తెరాస ప్రభుత్వంపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ను కెసిఆర్ పైరవీల భవన్గా మార్చారని, తాము అధికారంలోకి వస్తే దాన్ని ఆస్పత్రిగా మారుస్తామని టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు.

విబేధాలను పరిష్కరించే పనిలోనే...
మంత్రులు కెటి రామారావుకు, హరీష్ రావుకు మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే పనిలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ బిజీగా ఉన్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో పాలనను గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కెటిఆర్ను తన వారసుడిగా తెచ్చే క్రమంలో విభేదాలు చోటు చేసుకున్నాయని, దాంతో ఆ విభేదాలను పరిష్కరించడానికి కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ జత కలుస్తారా...
కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టే క్రమంలో టిడిపితో పవన్ కల్యాణ్ కలిసి వస్తారా అనేది ప్రశ్న. కెసిఆర్ పాలనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న గద్దర్ తెలంగాణలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే కెసిఆర్కు వ్యతిరేకంగా జనసేన ఒంటరిగా వెళ్లినా ఆశ్చర్యం లేదనే మాట వినిపిస్తోంది. అయితే, సిపిఎం, సిపిఐలతో ఏర్పడే కూటమితో అది జత కట్టే అవకాశాలు లేకపోలేదు. కాగా, టిడిపికి పవన్ కల్యాణ్ అనుకూలంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. దానివల్ల టిడిపితో తెలంగాణలో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటారనే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు.












Click it and Unblock the Notifications