తెలంగాణ: భారీ వోటింగ్తో కెసిఆర్ ఉత్సాహం
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగిన పోలింగులో భారీ వోటింగ్ జరిగింది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలకు, 119 శానససభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. తెలంగాణలో 72 శాతం పోలింగ్ జరిగింది. ఇది గత ఎన్నికల కన్నా ఆరు శాతం ఎక్కువ. ఈ వోటింగ్ తనకు లాభిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నమ్ముతున్నారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందనే ధీమాతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.
అయితే, లోకసభ స్థానాల విషయంలో మాత్రం తెరాస అంత ధీమాగా ఉన్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాదులో అత్యల్పంగా 53 శాతం పోలింగ్ మాత్రమే జరిగింది. హైదరాబాదులో వాణిజ్య సంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. దాంతో బుధవారం హైదరాబాదులో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
ముక్కోణపు పోటీ జరిగిన నల్లగొండ జిల్లాలో అధికంగా 80.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ జిల్లాలో తెరాస, కాంగ్రెసు, బిజెపి - టిడిపి కూటమి హోరాహోరీగా పోరాడాయి. నల్లగొండ పట్టణంలో మాత్రం 61 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. తెరాస బలంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పోలింగ్ భారీగా జరిగింది. కరీంనగర్ జిల్లాలో 76 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 78 శాతం, నిజామాబాద్ జిల్లాలో 69 శాతం, మెదక్ జిల్లాలో 77 శాతం పోలింగ్ జరిగింది. మెదక్ జిల్లా నుంచే కెసిఆర్ శాసనసభకు, లోకసభకు పోటీ చేశారు
2009 ఎన్నికల్లో తెలంగాణలో 67.7 శాతం పోలింగ్ జరిగింది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెరాస సాధారణ మెజారిటీకి అవసరమైన 60 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి తెలంగాణలో నామమాత్రమే కావచ్చునని అంటున్నారు.