ఫలించేనా: జూ ఎన్టీఆర్, లోకేష్ రాజీకొస్తారా?

జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన పార్టీకి అండగా నిలబడుతానని చెబుతున్నప్పటికీ తీరు చూస్తుంటే దూరంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు ఓవైపు వారసత్వ రాజకీయ గొడవ క్రమంగా సద్దుమణగ్గానే లోకేష్ ఆరంగేట్రం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు అవశ్యమైన నేపథ్యంలో కొంతమంది సీనియర్ నేతలు, యువ నేతలు వారి మధ్య సయోధ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.
దాదాపు రెండేళ్ల క్రితం లోకేష్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారనే ప్రచారం జరగడంతో వారసత్వ గొడవ రాజుకుంది. జూనియర్కు సన్నిహితుడైన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. నందమూరి హరికృష్ణ తీవ్రంగా స్పందించారు. దీంతో ఇరువురు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు.
ఆ తర్వాత జూనియర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను తాత స్థాపించిన టిడిపికే మద్దతిస్తానని చెప్పారు. కొడాలి నాని వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. తదనంతర పరిణామాలు విభేదాలను స్పష్టం చేశాయి. హరికృష్ణ కూడా అసంతృప్తితో ఉన్నారు. నాలుగు రోజుల క్రితం చంద్రబాబు స్పందిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీలోకి వెళ్లినా అభ్యంతరం లేదన్నట్లుగా మాట్లాడారు.
ఇది పార్టీకి అంత మంచిది కాదన్న అభిప్రాయంతో పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పలువురు నేతలు లోకేష్, జూనియర్ల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారట. పార్టీ యువ నేతలు రాజీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారట. రాయలసీమకు చెందిన ఒక మాజీ మంత్రి తనయుడు, మరికొందరు యువ నేతలు ఈ ఇద్దరినీ తరచూ కలుస్తూ వారధి కట్టే ప్రయత్నం చేస్తున్నారట.
లోకేశ్ ఇటీవల బహిరంగంగానే ఇటువంటి సానుకూల సంకేతాలు పంపిస్తున్నారు. 'చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచార సారథులుగా వ్యవహరిస్తారు. నాదంతా తెర వెనుక పాత్రే. వెనుక నుంచి చేయాల్సిన కృషి నేను చేస్తున్నాను' అని ఆయన ఇటీవల తెలుగు యువత సమావేశంలో చెప్పారు. లోకేశ్ ఈ మాట బహిరంగంగా చెప్పడం సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచిందని, దీని వల్ల విభేదాల్లోని తీవ్రత తగ్గుతోందని ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications