ఎన్టీఆర్ వర్సెస్ వైఎస్: బాబు, జగన్ మధ్య ఫైట్?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విగ్రహాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వివాదం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల విషయంలో ఆ వివాదం తలెత్తవచ్చునని అంటున్నారు. చంద్రబాబు ఆదేశాల నేపథ్యంలో ఆ వివాదం రచ్చకెక్కవచ్చునని అనుమానిస్తున్నారు.
రోడ్లుకు అడ్డంకిగా మారిన విగ్రహాలు తక్షణం తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అనుమతిలేని విగ్రహాలను అస్సలు ఉపేక్షించొద్దని ఆదేశించారు. విగ్రహాల వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని ఆయన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షలో ప్రస్తావించారు. 2013 జనవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు సైతం ఆదేశాలపై కొంత గడువు కోరినట్టు బాబుకు అధికార్లు వివరించారు.
ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఫ్లెక్సీలు, కటౌట్లు సైతం తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.జాతీయ నేతల విగ్రహాలు రోడ్ల మధ్య ట్రాఫిక్కు అడ్డంకిగాఉంటే, వాటిని దగ్గరలోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణకు తరలించాలని చంద్రబాబు సూచించారు.
వైయస్ జగన్ ఓదార్పు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద యెత్తున వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను స్థాపించారు. అంతకు ముందు నుంచి ఎన్టీ రామారావు విగ్రహాలను స్థాపించడం ఆనవాయితీగా వస్తోంది. అనుమతి లేవనే ఉద్దేశంతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిఘటించే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఆ పార్టీ ఆందోళనకు కూడా దిగవచ్చు. ఎన్టీ రామారావు విగ్రహాలు ఉన్నప్పుడు తమ నాయకుడి విగ్రహాలు ఎందుకు ఉండకూడదని అడగవచ్చు.
కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించే సమయంలో ఎన్టీఆర్ విగ్రహాలను కూడా తరలిస్తారా, లేద్ ఆనే విషయంపై సమస్య ఆధారపడి ఉంటుంది. ఎన్టీ రామారావును తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయి నాయకుడిగా ముందుకు తెచ్చింది. జాతీయ నాయకుల స్థాయిలో ఆయనను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఈ స్థితిలో ఎన్టీ రామారావు విగ్రహాలను తొలగించే అవకాశాలు లేవని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి, మరి.