30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ డిమాండ్!: రేవంత్
హైదరాబాద్: దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగితే కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ తెర పైకి వస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తద్వారా కొత్త అంశాన్ని లేవనెత్తారు! ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. దక్షిణ తెలంగాణ నేతలను కేబినెట్లోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఓ ప్రాంతానికి అధిక ప్రాముఖ్యత, మరో ప్రాంతంపై నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని ఆయన హితవు పలికారు.
కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో 30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణ పైన నిర్లక్ష్యం వహిస్తే.. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు డిమాండ్ వచ్చినా రావొచ్చునని ఆయన అన్నారు.
కాగా, గతంలో మాజీ మంత్రి డీకే అరుణ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటి నుండి జిల్లాలో పెత్తనం చేస్తామంటే సహించేది లేదని నాడు హెచ్చరించారు.
జిల్లాను విభజిస్తామంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తమ ప్రాంతాన్ని తాము అభివృద్ధి చేసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడగా ఉన్న కెసిఆర్ జిల్లాకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణ వాళ్లు వచ్చి దక్షిణ తెలంగాణను పాలిస్తే ఊరుకోమన్నారు.