టిఆర్ఎస్ పేరు మార్చి,భీమవరంలో పోటీచేస్తా: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, ఐటీ - పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో సరదాగా ఆయన చెప్పిన మాటలు నవ్వులు పూయించింది.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ రాకముందే ప్రచార పర్వం వేడెక్కింది. కెటిఆర్ కూడా హైదరాబాదును చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఓ సభలో మాట్లాడారు.
హైదరాబాద్ పైన కేవలం తెలంగాణ వారికే కాదని, ప్రపంచంలోని వారందరికీ హక్కు ఉంటుందని చెప్పారు. ఆంధ్రా వారిని, తెలంగాణ వారిని సమానంగా చూస్తామని చెబుతున్నారు. హైదరాబాదులో ఆంధ్రా ఓట్లు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోంది.
ఓ సందర్భంలో కెటిఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సమితి అవసరమైతే ముందు ముందు తెలుగు రాష్ట్ర సమితిగా మారనుందని, తాను ఏపీలోని భీమవరం నుంచి పోటీ చేస్తానని సరదాగా అన్నారు. భీమవరం నుంచి పోటీ చేయడం చాలా సులభమని చెప్పారు. అందుకే నేను భీమవరంను ఎంచుకున్నానని చెప్పారు. కోడిపందేలను లీగలైజ్ చేస్తామని చెబితే చాలు అక్కడ గెలుస్తామన్నారు.
'నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం సీఎం చంద్రబాబు గారు ఆహ్వానిస్తే కేసీఆర్ అక్కడికి వెళ్లారు. వెళ్లిన తర్వాత శంకుస్థాపన సభలో కేసీఆర్ గారిని ప్రసంగించేందుకు పిలిస్తే ఆయన లేవగానే ఎంత పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు వినిపించాయో మీ అందరికీ తెలుసు.
తర్వాత కొన్నిరోజులకు ఓ ఆంధ్రా మంత్రిగారు పెళ్లి కార్డు ఇచ్చేందుకు నా వద్దకు వచ్చారు. ఆయన నాకు గత మిత్రుడు. నాతో మాట్లాడుతూ... మా సీఎం కంటే మీ సీఎంకే ఎక్కువ చప్పట్లు కొట్టారు, ఏముంది దీంట్లో కిటుకు? అని నన్ను అడిగారు.
అప్పుడు నేను చెప్పాను... మేం కూడా పేరు మార్చబోతున్నాం... టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగు రాష్ట్ర సమితి అని మారుస్తాం, తప్పకుండా త్వరలోనే మీ దగ్గరకు కూడా వస్తున్నాం అని చెప్పాను.
ఒకవేళ ఆ పనే చేయాల్సి వస్తే ఏపీలో ఇప్పటికే నా నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నా. నేను కచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేస్తా. ఎందుకు అక్కడే పోటీ చేయాలనుకుంటున్నాననంటే భీమవరంలో గెలవాలంటే చాలా సింపుల్ ట్రిక్కు... ఏం లేదు, అక్కడ కోడి పందాలు లీగలైజ్ చేస్తామంటే చాలు గెలిచేస్తాం అని నేనెప్పుడూ చెబుతుంటాను" అని కేటీఆర్ నవ్వుతూ చెప్పగానే సభలో ప్రతి ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.