రిపోర్ట్: తెలుగు రాష్ట్రాల్లో అప్పు కింద ఆడపిల్లలు
హైదరాబాద్: భారతదేశంలో జరుగుతున్న బాల్యవివాహాలపై యునిసెఫ్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం చేసిన అప్పు తీర్చలేని తల్లిదండ్రులు తమ చిన్నారులను రుణదాతలకే ఇచ్చి వివాహాలు జరిపిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఈ తరహా పెళ్లిళ్లు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా జరుగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది.
తీసుకున్న అప్పును తీర్చలేని తల్లిదండ్రులు అప్పులోళ్ల గోల భరించలేక వివిధ కారణాలతో ఆడ పిల్లల్లకు చిన్నప్పుడే పెళ్లి చేసేస్తున్నారంట. భారత చట్టప్రకారం పెళ్లికి చట్టబద్ధమైన వయసు 18 ఏళ్లు అయినప్పటికీ, అవి నిండకపోయినా చిన్న వయసులోనే సామూహిక వివాహ వేడుకల్లో గుట్టుగా పెళ్లిళ్లు జరిపించేస్తున్నారు.
నిజానికి మన దేశంలో బాల్యవివాహాలు చట్టవిరుద్ధమైనా.. వాటిపై ప్రభుత్వం వివిధ రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఈ పెళ్లిళ్లు మాత్రం ఆగట్లేదు. చిన్నారుల భవితను తల్లిదండ్రులే చిదిమేస్తున్నారంటూ ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏటా జరిగే మొత్తం వివాహాల్లో బాల్యవివాహాలు 51.8 శాతం పైనే ఉంటున్నట్టు ఆ నివేదికలో పేర్కొంది. ఈ బాల్యవివాహాలకు ఒకప్పుడు నిరక్షరాస్యత ప్రధాన కారణం కాగా, ఇప్పుడు సామాజిక, ఆర్థిక, కుటుంబ కారణాలగా తేలాయని నివేదికలో వివరించింది.
తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 ఏళ్లలోపు వయసుగల బాలికల వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు నివేదికలో వెల్లడించింది. యునిసెఫ్ నివేదిక ప్రకారం పలు సందర్భాల్లో తల్లిదండ్రుల తాము తీసుకున్న అప్పు తీర్చలేకపోయిన లేదా కొత్తగా రుణం తీసుకోవాలన్నా తమ చిన్నారులను అప్పు ఇచ్చే వ్యక్తికో లేదా వారి సమీప బంధువులకో ఇచ్చి కట్టబెట్టేస్తున్నారు.
ఈ తరహా వివాహాలు ఎక్కువగా కూలి పని చేసుకునే వారు చేస్తున్నట్టుగా వివరించింది. అనంతరం వారిని బాలకార్మికులుగా మార్చేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో బాలకార్మికులు అధికంగా ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది.
తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 61 శాతం, హైదరాబాద్లో కనిష్ఠంగా 21 శాతం జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు ఉన్నత చదువులు చదవడం, ఆడపిల్లలు ఎక్కువగా పాఠశాలలకు వెళ్లడం, సంపద ఏ కొందరి చేతిలోనో కాకుండా అందరి వద్ద ఎంతో కొంత ఉన్న రాష్ట్రాల్లో బాల్యవివాహాలు తక్కువగా జరుగుతున్నాయని వివరించింది.
అయితే ఈ విధంగా జరగడానికి ఆచార వ్యవహారాలే కారణమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకు మేనమామలతో వివాహం జరిపించే ఆచారం ఉండడం వల్ల వధూవరుల మధ్య వయసులో తేడా ఎక్కువగా ఉంటోందని యునిసెఫ్ తన నివేదికలో పేర్కొంది.